మెదక్ అర్బన్, ఫిబ్రవరి 4: నేరస్తులకు శిక్షలు పడేందుకు కోర్టు డ్యూటీ పోలీస్ అధికారులు కృషి చేయాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అన్ని ఫంక్షనల్ వర్టికల్స్ సమావేశంలో పోలీస్ స్టేషన్ల వారీగా సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏపీపీ, పీపీ, జిల్లా కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేర రహిత సమాజంగా తీర్చిదిద్దాలంటే శిక్షపడేలా కోర్టు పోలీసులు శ్రమించాలన్నారు. న్యాయ శాఖ వారి సూచనలు, సలహాలు పాటిస్తూ శిక్షల శాతం పెంచాలన్నారు. వారెంట్స్, సమన్స్, ఎంసీ వర్టికల్స్ గురించి కోర్టు కానిస్టేబుళ్లు ఎప్పటికప్పుడు ఎన్బీడబ్ల్యూ క్రమం తప్పకుండా అమలు చేయాలన్నారు. కోర్టు క్యాలెండర్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు.
అన్ని రకాల వర్టికల్స్ అమలయ్యేలా చూడాలి
తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న పలు రకాల వర్టికల్స్ను అన్ని స్థాయిల పోలీస్ అధికారులు సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలని ఎస్పీ అన్నారు. రిసెప్షన్, బ్లూ కోట్స్, పెట్రో కార్స్, స్టేషన్ రైటర్లు, క్రైమ్ రైటర్లు, క్రై సిబ్బంది, కోర్టు డ్యూటీ అధికారులు, మెడికల్ సర్టిఫికెట్స్, ఎఫ్.ఎస్.ఎల్, సెక్షన్ ఇన్చార్జి, ఐఓలు జనరల్ డ్యూటీ సిబ్బందికి సంబంధించిన వర్టికల్స్పై జిల్లా సిబ్బందికి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో అమలుచేస్తున్న పలు రకాల వర్టికల్స్ విషయంలో ప్రతి పోలీస్ అధికారి శ్రద్ధ వహించి సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలన్నారు. ప్రతి వారం ఒకసారి అన్ని రకాల వర్టికల్స్పై సమావేశాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ సైదులు, తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి, పీడీజే పీపీ ఫజల్ ఆహ్మద్, ఫస్ట్ ఏడీజే సీపీ ప్రభుదాన్యం, సబ్ కోర్టు పీపీ రాజ్కుమార్, జేఎఫ్సీఎం కోర్ట్ పీపీ నవీన్కుమార్ నర్సాపూర్ ఏపీపీవో రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.