సంగారెడ్డి మే 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్నివిధాలుగా అండగా నిలుస్తున్నది. పంట సాగు చేసింది మొదలు కొనుగోలు వరకు ప్రభుత్వం రైతుల వెన్నంటే ఉంటున్నది. రైతుబంధుతో పెట్టుబడి సాయం, పంట చేతికొచ్చాక ప్రభుత్వమే కొంటున్నది. దీంతో రైతన్నకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అండగా ఉంటున్నది.
జిల్లాలో 8 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
సంగారెడ్డి జిల్లాలో తెల్లజొన్న కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. జిల్లా చరిత్రలో మొదటిసారి ప్రభుత్వం పొద్దు తిరుగుడును కొంటున్నది. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు మార్క్ఫెడ్ అధికారులు జిల్లాలో 8 జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్, బొక్కాస్గావు పీఏసీఎస్, రాయికోడ్ ఎంఏసీఎస్, సదాశివపేట పీఏసీఎస్, కృష్ణాపూర్ పీఏసీఎస్, ఏడాకులపల్లి పీఏసీఎస్, ఝరాసంగం పీఏసీఎస్, నిజాంపేట డీసీఎంఎస్ లో జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నారు.
53,565 మెట్రిక్ టన్నుల జొన్నల సేకరణే లక్ష్యం
జిల్లాలో నారాయణఖేడ్, సంగారెడ్డి, జహీరాబాద్, అందోలు, పటాన్చెరు నియోజకవర్గాల్లో రైతులు ఎక్కువగా జొన్నలు సాగుచేస్తారు. ఈ యాసంగిలో జిల్లావ్యాప్తంగా 26 మండలాల్లో 18,978 మంది 29,764 ఎకరాల్లో జొన్న సాగు చేశారు. నారాయణఖేడ్, అందోలు, సంగారెడ్డి నియోజక వర్గాల్లో ఎక్కువగా జొన్న సాగు చేశారు. కల్హేర్ మండలంలో 4,761 ఎకరాల్లో, కంగ్టి 4,016, నారాయణఖేడ్ 3,269 , సిర్గాపూర్ 3,160, వట్పల్లి 1984, కొండాపూర్ 1750, మనూరు 1587, ఝరాసంగం 1573, సదాశివపేట 1395, రాయికోడ్ 1028, నాగల్గిద్ద 1094 ఎకరాల్లో రైతులు జొన్న సాగు చేశారు. అందోలు, హత్నూర, పుల్కల్, పటాన్చెరు, సంగారెడ్డి, కోహీర్, న్యాల్కల్, మొగుడంపల్లి, జహీరాబాద్ మండలాల్లో 100 నుంచి 500 ఎకరాల్లో జొన్న సాగు చేశారు. 29764 ఎకరాల్లో 53,565 మెట్రిక్ టన్నుల జొన్న దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. దీంతో 53565 మెట్రిక్ టన్నుల జొన్నలు సేకరించేందుకు మార్క్ఫెడ్ 8 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది.
మద్దతు ధరతో రైతుకు లాభం
యాసంగిలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో జొన్న సాగు విస్తీర్ణం, దిగుబడి పెరిగింది. బహిరంగ మార్కెట్లో క్వింటాల్ జొన్నకు రూ.2400 ధర ఉంది. దీంతో రైతులు ఆందోళన చెందారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఆశించిన విధంగా జొన్న క్వింటాలుకు రూ.2970 మద్దతు ధర ప్రకటించింది. సోమవారం ఝరాసంగంలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించింది. త్వరలోనే అన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, జొన్నలను పూర్తిస్థాయిలో కొనేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
మొదటిసారిగా పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రం
సంగారెడ్డి జిల్లాలో మొదటిసారిగా ప్రభుత్వం పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. జిల్లాలోని రాయికోడ్, వట్పల్లి, మనూరు, కంగ్టి, నాగల్గిద్ద, నారాయణఖేడ్ మండలాల్లోని 269 ఎకరాల్లో పొద్దు తిరుగుడు సాగు చేశారు. 269 ఎకరాల్లో 159.27 మెట్రిక్ టన్నుల పొద్దు తిరుగుడు దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. మార్క్ఫెడ్ రాయికోడ్ వ్యవసాయ మార్కెట్లో పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి, పంటను కొనుగోలు చేస్తున్నారు. పొద్దుతిరుగుడు పంటకు ప్రభుత్వం క్వింటాల్కు రూ.6400 మద్దతు ధర ప్రకటించింది. బహిరంగ మార్కెట్లో క్వింటాల్కు రూ.4500 ధర లభిస్తున్నది. దీనికంటే రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర రూ.2 వేలు అధికంగా ఇవ్వనుండడంతో పంటను రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి తరలిస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర ఇవ్వడంతో పాటు, పంట కొనుగోలు కేంద్రం ప్రారంభించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.