సిద్దిపేట అర్బన్, మే 8: పార్టీకి, ప్రభుత్వానికి కార్యకర్తలు వారధిలా పని చేయాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని పోలీస్ కన్వెన్షన్హాల్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట పట్టణ విస్తృత స్థాయి సమావేశానికి మంత్రి హాజరయ్యారు. అనంతరం టీఆర్ఎస్ సిద్దిపేట పట్టణ కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడారు. కార్యకర్తలు పార్టీకీ, ప్రభుత్వానికి మూల స్తంభాలని, తప్పకుండా ప్రతి కార్యకర్తకు ఏదో ఒక సందర్భంలో అవకాశం వస్తుందన్నారు. పదవితో సంబంధం లేకుండా పార్టీ కోసం కష్టపడే వారిపై తనకు అమితమైన గౌరవం ఉంటుందన్నారు. పదవి ఉన్నా, లేకున్నా నాయకత్వంపై అభిమానం ఉండాలన్నారు. ఎక్కడ అవార్డు వచ్చినా సిద్దిపేట పేరు లేకుండా అవార్డే ఉండదన్నారు. ప్రజల కష్ట సుఖాల్లో సాయం చేయడం చాలా ముఖ్యమని.. ప్రతి కార్యకర్త కుటుంబానికి ఒక కుటుంబ సభ్యుడిలా భరోసా ఇచ్చామన్నారు. నేడు సిద్దిపేట అన్ని మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.
సిద్దిపేటకు అనేక విద్యాలయాలు తీసుకురావడంతో సిద్దిపేట విద్యాక్షేత్రంగా విరాజిల్లుతుందన్నారు. నాలుగు పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐ, మహిళా డిగ్రీ కాలేజీ, కేంద్రీయ విద్యాలయం ఇలా అనేక విద్యాలయాలు సిద్దిపేటకు తీసుకువచ్చామని, వెటర్నరీ సైన్సెస్ కోర్సు కూడా త్వరలో రాబోతుందన్నారు. అదేవిధంగా ఆలయాలకు, జలాశయాలకు ఖిల్లాగా సిద్దిపేట మారిందన్నారు. సీఎం కేసీఆర్ వల్లనే ఎన్నో ఏండ్ల కలగా ఉన్న సిద్దిపేట జిల్లా అయిందన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ దక్షిణ భారతదేశంలోనే నంబర్వన్గా ఉందన్నారు. అన్ని రంగాల్లో సిద్దిపేటను ఆదర్శంగా నిలిపామన్నారు. ప్రస్తుతం సిద్దిపేటకు రెండో రింగ్ రోడ్డు వేస్తున్నామని.. భవిష్యత్లో మూడో రింగ్ రోడ్డు రాబోతుందన్నారు. సిద్దిపేట అభివృద్ధ్దిని ప్రతిపక్ష పార్టీలే ప్రచారం చేస్తాయని అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని సిద్దిపేట మీద ఏడిచిన వాళ్లు ఇక్కడ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతారని అడిగారు. ముప్పై ఏండ్ల ముందు ఆలోచన చేసి పెద్దపెద్ద నగరాలకు మాత్రమే ఉండే అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ (సుడా)ని సిద్దిపేటకు తీసుకొచ్చామన్నారు. భవిష్యత్లో కూడా సిద్దిపేట పేరు ఇలానే నిలబెట్టుకుందామని, దానికి మీరంతా కలిసికట్టుగా పని చేయాలన్నారు. కంటిరెప్పలా కార్యకర్తలందర్నీ కాపాడుకుంటానని, పదవులు రాకపోయిన వారిని ఏదో రూపంలో కాపాడుకుంటామని హామీ ఇచ్చారు.
బీజేపీ ఓ అబద్దాల పుట్ట…
బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు అబద్దాలు తప్ప ఏమీ రావన్నారు. అబద్దాలు చెప్పడంలో బీజేపీకి నోబెల్ బహుమతి ఇవ్వచ్చన్నారు. మొన్న బీజేపీ నాయకుడు నడ్డా మాట్లాడుతూ కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు నీళ్లు రాలేదని చెప్పారని, నడ్డా వస్తాడో బీజేపీ రాష్ట్ర నాయకులు వస్తారో.. రండి నేను చూపిస్తా.. సిద్దిపేటకు వస్తే 50 గ్రామాల్లోని పంట పొలాల్లో, కాలువల్లో గలగల పారుతున్న గోదావరి జలాలు చూపిస్తా.. తాను కాదు మా రైతులే చూపిస్తారన్నారు. తెలంగాణలో 33 జిల్లాలుంటే 20 జిల్లాల ప్రజలకు సాగునీటి, తాగునీటి అవసరాలను కాళేశ్వరం ప్రాజెక్టు తీర్చుతుందన్నారు. రావడానికి సిద్ధంగా ఉన్నారా..? అని ప్రశ్నించారు. నడ్డా ఇలా మాట్లాడితే అంతకు నాలుగు రోజుల ముందు కేంద్ర మంత్రి గడ్కరీ తెలంగాణకు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ సస్యశ్యామలమవుతుందని, తెలంగాణ దేశానికే గ్రోత్ ఇంజన్ అని ప్రశంసించినట్లు తెలిపారు. నడ్డా అడ్డదిడ్డంగా బీజేపీ రాష్ట్ర నాయకులు రాసిచ్చిన స్క్రిప్టు చదివి అబద్దాలు మాట్లాడితే గడ్కరీ ప్రశసించారని ఇది బీజేపీ నాయకుల సమన్వయ లోపం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మరో అబద్దం నడ్డా మాట్లాడారని, మీ కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు నిండు పార్లమెంట్లోనే స్పష్టంగా కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరుగలేదని.. పారదర్శకంగా జరిగిందని చెప్పినట్లు చెప్పారు. బీజేపీ పార్లమెంట్లో ఓ మాట.. పాలమూరులో ఓ మాట.. మంత్రిదో మాట.. అధ్యక్షుడిదో మాటలా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధ్ది కోసం, ప్రజల సంక్షేమం 600 సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందని.. మీ బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి కనీసం 60 కార్యక్రమాలైనా చేస్తుందా? అని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్లో, పాలమూరు ప్రాజెక్ట్లో, మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్, కల్యాణలక్ష్మి, కేసీఆర్కిట్, దళితబంధు పథకాల్లో ఒక్క రూపాయి అయినా ఇచ్చారా.. అని అడిగారు. తెలంగాణకు అదనంగా సాయం చేయకపోగా, రాష్ర్టానికి రావాల్సిన న్యాయమైన, రాజ్యాంగ పరమైన నిధులు కూడా కేటాయించలేదని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తామని నడ్డా చెబుతున్నారని, ఇదే పాలమూరులో 2014 ఎన్నికల సభలో అధికారంలోకి వస్తే నరేంద్ర మోదీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారని.. కానీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు అయ్యిందని.. పాలమూరు ప్రాజెక్టుకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? అని అడిగారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాడు రూ.400 ఉన్న గ్యాస్ ధర నేడు రూ.1,050కి చేరిందన్నారు. ఏడేండ్లలో రూ.650 పెంచడమే కాకుండా గ్యాస్ సిలిండర్పై రాష్ట్రం అధిక పన్ను వసూలు చేస్తుందని వాట్సాప్లో దుష్ప్రచారం చేస్తున్నారని.. అది పెద్ద అబద్దమని తాను అధికారులను అడిగి మరీ తెలుసుకున్నానని చెప్పారు. సిలిండర్ ధరలు పెంచడమే కాకుండా సిగ్గు లేకుండా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సిగ్గు లేకుండా పాదయాత్రలు చేస్తున్నారని.. మతం పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని దీన్ని కార్యకర్తలు ఎక్కడికక్కడ తిప్పికొట్టి నిజాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు.