గజ్వేల్, ఏప్రిల్ 12: పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాజకీయ లబ్ధికోసమే గజ్వేల్ పట్టణానికి చెందిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్సీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో అర్హులైన లబ్ధిదారులను లక్కీడ్రా పద్ధతిలో ఎంపిక చేసిన కొద్ది రోజులకే అసెంబ్లీ ఎన్నికలు రావడం, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు రావడంతో అధికారులు అర్హులైన వారికి అందించడంతో అనివార్య కారణాల వల్ల ఆలస్యమైందన్నారు. లబ్ధిదారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసున్నారని, అర్హులైన వారికి మూడు సార్లు సర్వేల ఆధారంగా లక్కీడ్రా చేసి కేటాయించారన్నారు.
మల్లన్నసాగర్ ముంపు గ్రామాల బాధితులకు తాత్కాలికంగా ఇవ్వడంతో పంపిణీ చేయలేకపోయామన్నారు. గత ప్రభుత్వ హయాంలో లక్కీడ్రా పద్ధతిలో కేటాయించిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా కేటాయించాలని, లేనిపక్షంలో వారి పక్షాన పోరాటం చేస్తామన్నారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఈనెల 2న జాయింట్ కలెక్టర్, ఆర్డీవోల దృష్టికి సమస్యను తీసుకెళ్లారన్నారు. లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించకుండా తాత్సారం చేస్తే వారి తరపున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ రోజు కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి లబ్ధిదారులను కావాలనే పంపించారన్నారు. రోజూ లబ్ధిదారులను మున్సిపల్ కార్యాలయానికి పంపిస్తున్నారని, అలాంటి చర్యలను మానుకోవాలన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్ జకీయోద్దీన్, కౌన్సిలర్లు వంటేరు గోపాల్రెడ్డి, మెట్టయ్య తదితరులు పాల్గొన్నారు.