కోహీర్, మార్చి 25: ‘ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించాలి’ అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం జహీరాబాద్ పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన 48గంటల్లోనే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించామన్నారు. ఇప్పటివరకు 33కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని వెల్లడించారు. కొత్తగా వెయ్యి బస్సులను కొనుగోలు చేశామని, మరో రెండు వేల బస్సులను సమకూర్చుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఆర్టీసీలో మూడు వేల ఉద్యోగాలు కల్పించడంతో పాటు పీఆర్సీ కల్పించామన్నారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని ప్రధాని మోదీ అనడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనన్నారు. యేటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా అని మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై శాపనార్థాలు పెడుతున్నారని, ప్రభుత్వం కూలిపోతుందని చెప్పడం విడ్డూరమన్నారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. కర్ణాటకలోని గానుగపూర్ దైవ దర్శనానికెళ్లి హైదరాబాద్ తిరిగి వస్తున్న సందర్భంగా జహీరాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ను ఘన స్వాగతం పలికి పూలమాల, శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎంపీ సురేశ్ శెట్కార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.