వర్గల్,మార్చి6 : సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటులో తలెత్తిన వివాదంలో అంబేద్కర్ సంఘం, బహుజ ఫ్రంట్, ఎమ్మార్పీ ఎస్ తదితర సంఘాల నాయకులపై నమోదయిన కేసులను వెంటనే ఎత్తివేయాలని గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి వంటేరు ప్రతాపరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నాచారంలో అంబేద్కర్ విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దె స్థలాన్ని పరిశీలించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం సంఘం నాయకులకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ప్రతాపరెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటులో తలెత్తిన వివాదం కేసుల వరకు వెళ్లడం బాధాకరమన్నారు. భారతదేశానికి రాజ్యాంగం రాసిన మహానీయుడి విగ్రహం ఏర్పాటు చేస్తే ఓర్వలేని కొంతమంది సహకారంతో ఆర్అండ్ బీ అధికారులు రాత్రికి రాత్రే గెద్దను కూల్చడం సిగ్గుచేటన్నారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటులో శాంతియుత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత పోలీసులు,ఆర్అండ్బీ అధికారులపై ఉందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ భహాయంలో రోడ్డు వెడల్పుకోసం నిధులు కూడా మంజూరు చేశామని గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రోడ్డును వెడల్పు చేసే పనిని పక్కకు పెట్టిందని, తద్వారా ఇక్కడ రోడ్డు యాక్సిడెంట్లు కూడా జరిగి ప్రాణాలు పోయిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు. అందరి ఆమోదంతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేలా గామస్తులు చొరవ చూపాలని కోరారు. విగ్రహం ఏర్పాటుకు తనవంతు ఆర్థిక సాయం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమం గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ల్యాతొల్ల వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.