Khushbu Sundar | తమిళనాడులో మాజీ ఉప ముఖ్యమంత్రి, నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దక్షిణాది సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. తంజావూరులో నిర్వహించిన ఒక బహిరంగ సభలో నటి త్రిష పేరును ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ ఘాటుగా స్పందిస్తూ ఉదయనిధిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఖుష్బూ సుందర్, మహిళలను అవమానించేలా మాట్లాడటం ఏ నాయకుడికీ తగదని పేర్కొన్నారు. ప్రజా వేదికపై మాట్లాడే ప్రతి మాటకు బాధ్యత ఉండాలని, రాజకీయ విభేదాల పేరుతో మహిళల గౌరవాన్ని దెబ్బతీయడం ఏమాత్రం సమంజసం కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
తన పోస్టులో మహిళా శక్తికి ప్రతీకగా భావించే దేవత చిత్రాన్ని పంచుకున్న ఖుష్బూ, “ఇలాంటి వ్యాఖ్యలు చీప్ రాజకీయ సంస్కృతికి నిదర్శనం. ప్రజలను నడిపించే స్థానంలో ఉన్నవారు మరింత బాధ్యతగా వ్యవహరించాలి” అని పేర్కొన్నారు. మహిళల గౌరవాన్ని రాజకీయ విమర్శలకు ఆయుధంగా ఉపయోగించడం తప్పని ఖుష్బూ స్పష్టం చేశారు. రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు సహజమే అయినప్పటికీ, వ్యక్తిగత దూషణలు లేదా మహిళలను కించపరిచే వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మంచివి కావని అన్నారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలను సాధారణంగా తీసుకుంటే, రేపు ఏ కుటుంబమైనా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. రాజకీయ నాయకులు తమ మాటలపై నియంత్రణ పాటించాలి అని ఆమె పేర్కొన్నారు.
త్రిష పేరును వివాదంలోకి లాగడం అనవసరమని పేర్కొన్న ఖుష్బూ, ఉదయనిధి స్టాలిన్ ఎలాంటి షరతులు లేకుండా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలు తప్పని అంగీకరించి బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా, కావేరి జలాల అంశంపై తంజావూరులో నిర్వహించిన నిరసన సభలో ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తుండగా, సభలోని ఒక వ్యక్తి త్రిష పేరును ప్రస్తావించినట్లు వీడియోల్లో కనిపించింది. అనంతరం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. దీనిపై నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.