రాయపోల్ ఫిబ్రవరి 23 సిద్దిపేట జిల్లాలో అకాల వర్షం రైతన్నలకు కన్నీరు మిగిల్చింది. రాయపోల్, దౌల్తాబాద్ మండలాల పరిధిలోని ఆయా గ్రామాల్లో సోమవారం కురిసిన వర్షానికి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. చేతికొచ్చిన మొక్కజొన్న, పొద్దు తిరుగుడు పంటలతోపాటు కూరగాయ పంటలు దెబ్బతినండంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి.. కష్టపడి పండించిన పంటలు కండ్ల ముందే నేల రాలడంతో రైతాంగం లబోదిబోమంటోంది.
అల్పపీడనం ప్రభావంతో సోమవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం పలు పంటలకు తీవ్రంగా నష్టపరిచింది. కొత్తపల్లి, రాయపోల్, తిమ్మక్కపల్లి, అనాజిపూర్, మంతూర్, రామారం, గొల్లపల్లి, దౌల్తాబాద్ మండలంలోని అహ్మద్నగర్, ముబారస్ పూర్తి, దొమ్మాట, గాజులపల్లి… తదితర గ్రామాల్లో వర్ష తీవ్రతకు చేతికి వచ్చిన పంటటు నేల రాలిపోయాయి.
పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. దీంతో విద్యుత్ సరఫరాకు మండల కేంద్రంలో సుమారు 5 గంటల పాటు అంతరాయం ఏర్పడింది. అకాల వర్షానికి నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు పర్యటించి నివేదికలు తయారుచేసి జిల్లా అధికారులకు అందించి పరిహారం అందించాలని మండల రైతులు కోరుతున్నారు.