నిజాంపేట, మార్చి 26: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో భూగర్భ జలాలు అడుగంటి కొన్నిచోట్ల పొలాలు ఎండిపోగా.. వడగండ్ల వర్షంతో చాలా గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. యాసంగికి మంచి దిగుబడులు సాధిస్తామనుకున్న అన్నదాతల ఆశలు ఆవిరయ్యాయి. నిజాంపేట చెందిన రైతు దుబ్బరాజు సాగు చేస్తున్న రెండెకరాల వరి పొలానికి బోరు నుంచి సరిపడా నీళ్లురాక పూర్తిగా ఎండిపోయింది. పెట్టుబడికి పెట్టిన ఖర్చులు రాకపోవడంతో రైతు దుబ్బరాజు కన్నీటి పర్యంతమయ్యాడు. వడగండ్ల వర్షానికి కౌలు రైతు లక్ష్మణ్ సాగు చేస్తున్న మూడెకరాల వరిపొలం పూర్తిగా నేలకొరిగింది. దీంతో మూడెకరాల పొలం పశువుల మేతగా మారిపోయింది.