మద్దూరు(ధూళిమిట్ట), జూన్2 1: పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి మృత్యువాత పడిన సంఘటన సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం తోర్నాలలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతు మాదాసు దశరథం(46) వ్యవసాయ పనుల కోసం సాయంత్రం 5గంటలకు తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు.
భారీ వర్షం కారణంగా బావి వద్దే చిక్కుకపోయిన దశరథంపై పిడుగుపడి మృతి చెందాడు. కుటుంబసభ్యులు తెల్లవారుజామున బావి వద్దకు వెళ్లి చూడగా దశరథం విగతజీవిగా కనిపించాడు. మృతుడికి భార్య రజిత, కూతురు ఉన్నారు. పిడుగుపాటుకు గురై మృతి చెందిన దశరథం కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ తాళ్లపల్లి రాజమ్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.