తలాపునే ప్రాజెక్టులు ఉన్నా.. సాగు నీరు మాత్రం సున్నా..! కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పదేండ్లలో ఎన్నడూ లేని నీళ్ల కరువును రైతులు ఇప్పుడు కనులారా చూస్తున్నారు. ఓ వైపు భూగర్భ జలాలు అడుగంటిపోతుండగా, మరోవైపు కరెంటు ‘కట్’కటతో ఇబ్బందులు నెలకొన్నాయి. పొలాల్లో ఎండిపోతున్న పైరు మూగజీవాలకు గ్రాసంగా మారుతున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పచ్చని పంటలు ఎండుగడ్డిని తలపిస్తున్న దృశ్యాలు కాంగ్రెస్ సర్కారు తెచ్చిన కరువుకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
ఐదారేండ్లుగా నీళ్లకు గోసరాలేదు. ఎటూచూసినా భూములు పచ్చగా కనబడేవి. జీ వాలు మేసేందుకు జాగ కూడా దొరకకపోయేది. తుమ్మచెట్లు, గుట్టల పొంటి మేపేది. అవసరమైతే జీవాలతోని మన్యం పోయేది. అసోంటిది ఇప్పుడు ఎటుచూసినా ఎండిన పొలాలు కనిపిస్తున్నాయి. మాఊరే కాదు, చుట్టుపక్కల ఊళ్ల కూడా గిట్లనే ఉంది పరిస్థితి. నాకున్న ఎకరం పొలం ఎండిపోయింది. సుట్టపోళ్లకు ఫోన్ చేస్తే కూడా పొలాలు పారతలేవు అనేదే చెప్పుతుండ్రు. కాంగ్రెసోళ్లతోనే కరువు అచ్చినట్లు అయ్యింది. ఇరవై ఐదేండ్ల కిందట కాలం మళ్ల ఇప్పుడు యాదికి వస్తున్నది.