సిద్దిపేట, జనవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జిల్లాలో ఏ పల్లెను చూసినా పరిశుభ్రం, పచ్చదనంతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్నది. ఇం టింటా నిత్యం చెత్త సేకరణ విజయవంతంగా జరుగుతున్నది. రోడ్లకు ఇరువైపులా, ఖాళీస్థలా ల్లో, కార్యాలయాలు, పాఠశాలల ఆవరణలు పచ్చదనం సంతరించుకున్నాయి. పల్లె ప్రగతి కార్యక్రమం అమలు తర్వాత సమస్యలన్నీ దూరమై పల్లెలు కొత్తరూపును సంతరించుకున్నాయి. ప్రతి గ్రామ పంచాయతీకి ప్రభుత్వం ట్రాక్టర్ను అందించింది. వాటితో ప్రతిరోజు గ్రామాల్లో ఇంటింటా చెత్త సేకరణ జరుగుతున్నది. అన్ని గ్రామాల్లో డంపింగ్యార్డులను ఏర్పాటు చేశారు. చెత్తను సేకరించి సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. ఈ ఎరువును హరితహారంలో నాటి న మొక్కలకు వాడుతున్నారు. ఫలితంగా పల్లెలు పరిశుభ్ర వాతావరణంలో కనిపిస్తున్నాయి. సం క్రాంతి పండుగకు పట్టణాల నుంచి వస్తున్న ప్రజలకు పచ్చదనంతో స్వాగ తం పలుకుతున్నాయి.
489 గ్రామాల్లో నర్సరీల ఏర్పాటు..
జిల్లాలో 489 గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేసి 62.64 లక్షల మొక్కలు పెంచారు. గ్రామాల్లో పచ్చదనం ఉట్టిపడేలా హరితహారంలో మొక్కలు నాటారు. ఏ గ్రామానికి వెళ్లినా పచ్చలహారం తొడిగినట్లుగా పచ్చని చెట్లు స్వాగతం పలుకుతున్నా యి. గ్రామాలను పరిశుభ్ర వాతావరణంలో ఉం చేందుకు సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని 2019 అక్టోబర్లో ప్రారంభించారు. గ్రామాలకు ప్రతినెలా ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తుండడంతో ఆ గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నారు. గ్రామాల్లో జవాబుదారీతనం పెరిగింది. పల్లెప్రగతి కార్యక్రమంలో చేపట్టిన ప్రతి పనిని యాప్లో పొందుపరుస్తున్నారు. ఆయా గ్రామాలకు సంబంధించిన పూర్తి వివరాలను యాప్లో పొందుపర్చడంతో గ్రామస్తులకు పూర్తి సమాచారం అందుబాటులో ఉంటున్నది. మండలానికి మూడు చొప్పున 5 నుంచి పదెకరాల స్థలాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 55 స్థలాలను గుర్తించి 45 బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటుచేశారు. వీటిలో 6.59 లక్షల మొక్కలు నాటారు. ఏడో విడత హరితహారంలో భాగం గా 2022-23 సంవత్సరంలో 23.62 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 29.45 లక్షల మొక్కలు నాటి కంటి రెప్పలా కాపాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గ్రామా ల్లో ఎకరం స్థలంలో 5 రకాల క్రీడలు ఆడుకునేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఇప్పటి వరకు జిల్లాలో 443 స్థల సేకరణ చేసింది. వీటిలో 421 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి.
ఆహ్లాద, ఆరోగ్యకర వాతావరణం..
ఇవాళ ఏ పల్లెను చూసినా పరిశుభ్రం, ఆహ్లాదంతో కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ కృషితో గ్రామాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడింది. ఫలితంగా గ్రామాల్లో రోగాలు తగ్గుముఖం పట్టాయి. ఎటుచూసినా పచ్చని చెట్లు స్వాగతం పలుకుతున్నాయి. సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చింది. గ్రామాలకు ప్రతినెలా నిధులు వస్తున్నాయి. దీంతో పంచాయతీల నిర్వహణ బాగున్నది. మొక్కల పెంపకం, డ్రైనేజీల నిర్వహణ, ఇంటిం టా తడి, పొడి చెత్త సేకరణ, డంపింగ్యార్డులకు చెత్త తరలించి సేంద్రియ ఎరువు తయారీ, వైకుంఠధామాలు, నర్సరీల నిర్వహణ విజయంతంగా చేపడుతున్నారు. ఇం టింటా మిషన్ భగీరథతో తాగునీరందిస్తున్నారు. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతో మౌలిక వసతులు మెరుగుపడి గ్రామాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి.
ప్రతినెలా పంచాయతీలకు నిధులు..
ప్రతినెలా గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నది. ఠంచన్గా గ్రామాలకు నిధులు వస్తుండడంతో పల్లెల రూపురేఖలు మారిపోతున్నాయి. 2019 అక్టోబర్లోరూ.13.18 కోట్లు, నవంబర్ 2019లో రూ.13.18కోట్లు, డిసెంబర్ 2019లో రూ.12.52 కోట్లు, 2020 జనవరిలో రూ.12.85 కోట్లు, ఫిబ్రవరి-2020లో రూ.13.84కోట్లు, మార్చి 2020లో రూ.12.85కోట్లు, ఏప్రిల్ 2020లో రూ.11.23 కోట్లు, మే 2020లో రూ.11.23కోట్లు, జూన్ 2020 లో రూ.11.23కోట్లు, జూలై 2020 లో రూ.10.11కోట్లు, ఆగస్ట్టు 2020లో రూ.10.11కోట్లు, సెప్టెంబర్ 2020లో రూ.10.11కోట్లు, అక్టోబర్ 2020లో రూ.10.10కోట్లు, నవంబర్ 2020లో 10.10కోట్లు, డిసెంబర్ 2020లో రూ.10.10 కోట్లు, జనవరి 2021 నుంచి డిసెంంబర్ 2021 వరకు ప్రతినెలా రూ.7.68 కోట్ల చొప్పున రూ. 93.22 కోట్లు ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాయి. జనవరి 2022 నుంచి డిసెంబర్ 2022 వరకు ప్రతినెలా సరాసరిగా రూ.7.91 కోట్ల చొప్పు న రూ.94.92 కోట్లు జిల్లాకు విడుదలయ్యాయి. పల్లె ప్రగతి ప్రారంభం నాటి నుంచి నేటి వరకు సుమారుగా రూ.360.25 కోట్ల నిధులను పంచాయతీలకు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులతో పల్లెలు బాగుపడ్డాయి.