హుస్నాబాద్, ఫిబ్రవరి 7: ‘ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్న దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోని దళితులకు ఉపాధి అవకాశాలు కల్పించి ధనికులనే చేయడమే లక్ష్యంగా అమలు చేస్తున్న ఈ పథకాన్ని, హుస్నాబాద్ నియోజకవర్గంలో పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశాం. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇప్పటికే సర్వే ప్రారంభమయ్యింది. దళితబంధు అమలులో సర్కారు లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అన్ని విధాలా చర్యలు చేపడుతున్నాం. నియోజకవర్గానికి కేటాయించిన యూనిట్లను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటాం..’ అని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. దళితబంధు అమలుపై ఎమ్మెల్యేతో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ..
దళితబంధు పథకంపై మీ అభిప్రాయం ఏమిటి?
ఎమ్మెల్యే సతీశ్కుమార్: సీఎం కేసీఆర్ ఎంతో దూరదృష్టితో ఈ పథకానికి రూపకల్పన చేశారు. దశాబ్దాలుగా అణగారిన వర్గాలు గానే మిగిలిపోతున్న దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దేశంలోనే ఎక్కడా లేనివిధంగా పథకాన్ని రూపొందించి అమలు చేయడం ఎంతో గర్వంగా ఉంది. ఇన్నాళ్లూ నిర్లక్ష్యానికి గురైన దళితుల జీవన విధానాల్లో పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇది ఒక బృహత్తర పథకం. దళితులు ధనవంతులు కావడం వందశాతం ఖాయం. ఇలాంటి గొప్ప పథకాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు దళితులు ఎల్లవేళలా రుణపడి ఉంటారు.
ఈ పథకం ద్వారా ఇచ్చే రూ.10 లక్షలతో ప్రయోజనం చేకూరుతుందంటారా?
దేనికైనా ప్రారంభం అనేది ప్రధానం. ఇన్ని రోజులు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన రూ.50 వేలు, రూ.లక్ష రుణాలతో కూడా అభివృద్ధి సాధించిన వారు ఉన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోని వారూ ఉన్నారు. ఇచ్చిన డబ్బులు సరైన పద్ధతిలో వినియోగం అవుతున్నాయా లేదా అనే పర్యవేక్షణ ఉంటే లబ్ధ్దిదారులు నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది. దళితబంధు కింద ఇస్తున్న రూ.10 లక్షలు అనేది చిన్న సాయం కాదు. దీనిని అంకితభావం, పట్టుదలతో లబ్ధ్దిదారులు వినియోగించుకుంటే వారి జీవితాలు పూర్తిగా మారిపోతాయి. వారిలో పరివర్తన వస్తుంది. ప్రభుత్వ మద్దతుతో అభివృద్ధి తప్పకుండా సాధ్యమవుతుంది.
ప్రభుత్వం ఇచ్చే సాయంతో ఏయే పనులు చేసుకునే అవకాశం ఉంది?
దళితబంధు కింద వచ్చే సాయంతో ఆయా కుటుంబాల వృత్తితో పాటు వారికి ప్రావీణ్యం ఉన్న పని, వృత్తిని మరింత అభివృద్ధ్ది చేసుకునే అవకాశం ఉంది. సెంట్రింగ్ పనులు, ట్రక్కుల కొనుగోలు, పాడిపరిశ్రమ, పాలీహౌస్ ద్వారా కూరగాయలు పెంచుకోవడం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటు, కోళ్లు, గొర్రెల పెంపకం, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు 500 గజాల స్థలంలో పాలీహౌస్ నిర్మాణం చేసుకొని సొంతంగా కూరగాయలు పండించి మార్కెటింగ్ చేసుకుంటే ఖర్చులన్నీ పోను నెలకు కనీసం రూ.15 నుంచి రూ.20 వేల ఆదాయం వస్తుంది.
పథకం అమలుకు ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తున్నారు?
మా నియోజకవర్గానికి ప్రస్తుతం 100 యూనిట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిని వందశాతం వినియోగించుకోవాలని అనుకుంటున్నాం. అయితే ఒక్కో ఊరిలో కొందరికి మాత్రమే ఇచ్చి ఇంకొందరికి ఇవ్వకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి కొన్ని గ్రామాలను ఎంపిక చేసి వాటిల్లో వందశాతం కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని అనుకుంటున్నం. మొదటి దశలో హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లోని మూడు గ్రామాలను ఎంపిక చేసి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టాలనే కార్యాచరణ రూపొందించాం. దశల వారీగా నియోజకవర్గం మొత్తం అమలు చేస్తాం. ఆ మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేశాం.
దళితబంధు పథకంపై మీరిచ్చే సలహా ఏమిటి?
రాష్ట్ర ప్రభుత్వం గతంలో గొల్లకుర్మలు, మత్స్యకారులు, బ్రాహ్మణ పరిషత్ తదితర వర్గాలకు సాయం చేయడం ద్వారా మంచి ఫలితాలను సాధించింది. దళితబంధు పథకం ద్వారా కూడా దళితులకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది. దళితులు ఒక పనిని లేదా పరిశ్రమను ఎంచుకొని అందులో పెట్టుబడి పెట్టి మంచి లాభాలను ఆర్జించడం ద్వారా తమ కుటుంబాలను ఏలోటు లేకుండా పోషించుకోవాలని సూచిస్తున్నాం. దళితులు అందరిలో తలెత్తుకొని తిరిగే రోజులు రావాలంటే, అంటరానితనం సమూలంగా పోవాలంటే దళితులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధిని సాధించడంతో పాటు అందరూ సమానులే అనే ఆలోచన వచ్చినప్పుడే అసలైన లక్ష్యం నెరవేరినట్లు అవుతుంది.
నియోజకవర్గంలో ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలనుకుంటున్నారు?
హుస్నాబాద్ నియోజకవర్గంలో ఒక ప్రత్యేకాధికారి నియామకం ద్వారా వ్యక్తిగత యూనిట్ ద్వారా, లేదా సామూహిక యూనిట్ ద్వారా లబ్ధ్దిదారులు ఏదో ఒక వ్యాపారం లేదా పరిశ్రమ నెలకొల్పుకొనేలా అవగాహన కల్పిస్తున్నాం. 5 నుంచి 10మంది లబ్ధిదారులు కలిసి ఒక పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నాం. నిరంతర పర్యవేక్షణ ద్వారా ప్రభుత్వం ఇచ్చిన సాయం లబ్ధిదారులకు వందశాతం ఉపయోగపడేలా చేయడం, తద్వారా ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడమే లక్ష్యంగా ముందుకు వెళ్తాం.
మీ నియోజకవర్గంలో దళితుల జీవన స్థితిగతులు ఏమిటి?
హుస్నాబాద్ నియోజకవర్గంలోని దళితులు దాదాపుగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారే అని చెప్పొచ్చు. కొంతమంది ఉద్యోగ ఉపాధి మార్గాలతో ఆర్థికంగా నిలదొక్కున్నప్పటికీ, ఎక్కువ మంది ఆర్థికంగా అంతంత మాత్రమే. ఎక్కువ మంది వ్యవసాయ కూలీలు, ఇతర కూలీలుగానే జీవనం సాగిస్తున్నారు. దళితబంధు పథకం మా నియోజకవర్గంలోని దళితులకు ఎంతగానో దోహదపడనున్నది.
హుస్నాబాద్ నియోజకవర్గంలో దళితుల సంఖ్య ఎంత?
హుస్నాబాద్ నియోజకవర్గంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 63,740 దళిత జనాభా ఉంది. ఇందులో పురుషులు 31,933, మహిళలు 31,807 ఉన్నారు. ఇప్పుడు ఈ సంఖ్య మరింత పెరిగి ఉంటుంది. ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం అయితే నియోజకవర్గంలో సుమారుగా 20వేల దళిత కుటుంబాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నాం. రాబోయే రోజుల్లో వీరందరికీ లబ్ధ్ది చేకూరుతుందనే నమ్మకం నాకుంది. ఎందుకంటే సీఎం ఒక నిర్ణయం
తీసుకున్నారంటే అది పూర్తయ్యే వరకు వదలరు.