గజ్వేల్, నవంబర్ 14: మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసానికి ఏర్పాటు చేసిన ముట్రాజ్పల్లి ఆర్అండ్ఆర్ కాలనీలో నివసిస్తున్న ప్రజలు స్వయం ఉపాధితో అభివృద్ధి బాటలో పయనిస్తున్నారు. భూ నిర్వాసితులకు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా తెలంగాణ ప్రభుత్వం పరిహారం ఇవ్వడంతో పాటు గజ్వేల్ పట్టణంలో డబుల్ బెడ్రూం ఇండ్లతో ప్రత్యేక కాలనీని కూడా నిర్మించి ఇచ్చింది. వీరిలో చాలామంది గజ్వేల్, చేర్యాల, దుబ్బాక, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు కొనుగోలు చేయగా, మరికొంత మంది రియల్ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. మల్లన్నసాగర్తో పాటు కొండపోచమ్మ భూ నిర్వాసితులకు ఉపాధి కల్పన కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో వర్గల్ ప్రాంతంలో 600 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ఆర్అండ్ఆర్ కాలనీకి గజ్వేల్ 4 కి.మీ దూరం ఉండడంతో నిత్యావసరాల కోసం పట్టణానికి వెళ్లేందుకు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొందరు గతంలో తమ గ్రామాల్లో నిర్వహించిన కిరాణ, కులవృత్తుల దుకాణాలను ఆర్అండ్ఆర్ కాలనీలోనే కొనసాగిస్తున్నారు. ఇండ్ల వద్ద ఖాళీస్థలం ఉండడంతో ఆ ప్రదేశాల్లో చికెన్, మటన్ షాపులు, ఫాస్ట్ఫుడ్, టిఫిన్ సెంటర్లు, వాటర్ప్లాంట్లు, లేడీస్ ఎంపోరియం, మెడికల్ దుకాణాలు తదితర వ్యాపారాలను ప్రారంభించారు. ఆర్అండ్ఆర్ కాలనీలో 1430 కుటుంబాలు నివాసం ఉంటుండగా, వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. చిన్నచిన్న ఉద్యోగాలతో అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నది. పల్లెపహాడ్, ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్ తదితర గ్రామాల యువకులు పేరున్న వ్యాపార సంస్థల నుంచి ప్రాంచైజీలు తీసుకుని గజ్వేల్ పట్టణంలో వ్యాపారాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.