మేళతాళాలు..మంగళ వాయిద్యాలు.. సన్నాయి రాగాలు.. అశేష భక్తజనం సమక్షంలో ఆదివారం కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ తోటబావి వేదిక వద్ద గల మండపంలో ఉదయం 10.45 గంటలకు వధువులు మేడలాదేవి, కేతమ్మదేవీలను మల్లికార్జున స్వామి వివాహమాడారు. అంతకు ముందు కోలాటాలు.. చెక్క భజనలు.. వేద పాఠశాల విద్యార్థుల శివకీర్తనలతో కల్యాణ వేదిక వద్దకు ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. బార్శీ మఠానికి చెందిన సిద్ధగురు మణికంఠ శివాచార్యుల పర్యవేక్షణలో వీరశైవ ఆగమ సంప్రదాయం ప్రకారం కల్యాణం జరిపించారు. భారీగా భక్తులు తరలిరాగా.. మల్లన్న నామస్మరణతో పరిసరాలు మార్మోగాయి.
సిద్దిపేట ప్రతినిధి/చేర్యాల, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం ఆదివారం ఆలయ తోటబావి వేదిక వద్ద వైభవంగా జరిగింది. కల్యాణాన్ని వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా మమ్మేలు స్వామి మల్లన్న అంటూ భక్తుల నామస్మరణతో పరిసరాలు మార్మోగాయి. ప్రభుత్వం తరపున ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామివారి తరపున పడిగన్నగారి మల్లయ్య దంపతులు, అమ్మవార్ల తరపున మహాదేవుని రవి దంపతులు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. గర్భగుడిలో జరిగిన కల్యాణోత్సవంలో అమ్మవారి తరపున మహాదేవుని సాంబయ్య, స్వామివారి తరపున పడిగన్నగారి మల్లికార్జున్ దంపతులు పాల్గొని కల్యాణ తంతు నిర్వహించారు.
మేళతాళాలతో ఊరేగింపు…
అంతక ముందు స్వామి,అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను అర్చకులు ఆలయం నుంచి పోలీసు బొమ్మ, రాతిగీరలు, ఆలయ పరిసరాల్లో ఊరేగించారు. మేళతాళాలు, కోలాటం, చెక్క భజనలు, వేద పాఠశాల విద్యార్థుల శివకీర్తనలతో కల్యాణ వేదిక వద్దకు ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చారు. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా బార్శీ మఠానికి చెందిన సిద్ధగురు మణికంఠ శివాచార్యుల పర్యవేక్షణలో కల్యాణం జరిగింది. వీరశైవ ఆగమ పండితులు, పురోహితులతో పాటు ఆగమ పాఠశాల వేదపండితులు, విద్యార్థులు ఉత్సవాన్ని నిర్వహించారు. కల్యాణోత్సవానికి పురోహితులుగా నడిపుడి మఠం భవానయ్య స్వామి, భువనేశ్వరస్వామి, ఆనందయ్య, జ్ఞానశ్వర్శాస్త్రి, చంద్రశేఖర్స్వామి, భద్రయ్యస్వామి వ్యహరించారు. డాక్టర్ మహంతయ్య, నందుల మఠం శశిభూషణ సిద్ధాంతి స్వామీజీ వ్యాఖ్యాతలుగా వ్యహరించారు. ఆలయవర్గాలు ఏర్పాటు చేసిన మండపం, శామియానాలు, చలువ పందిళ్లు ఆకర్షణీయం, సౌకర్యంగా ఉండడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఉదయం 5గంటలకు ఆలయవర్గాలు రెండు క్వింటాళ్ల బియ్యాన్ని అన్నం వండి రాశిగా తయారుచేసి దృష్టికుంభం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ఒగ్గు పూజారులు ఒగ్గు విన్యాసాలతో పసుపు బండారితో స్వామి వారి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరపున మంత్రి తన్నీరు హరీశ్రావు పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కొమురవెల్లి క్షేత్రం వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆలయపాలక మండలి చైర్మన్ గీస భిక్షపతి, ఈవో బాలాజీ, ఏఈవోలు వైరాగ్యం ఆంజయ్య, అర్చకుల ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అంతకు ముందు కొమురవెల్లి గ్రామ సంప్రదాయం మేరకు సర్పంచ్ సార్ల లతకిష్టయ్య దంపతులు, ఒగ్గు పూజారులు పట్టువస్ర్తాలు, పుస్తెమట్టెలు సమర్పించారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు నర్ర రఘువీర్రెడ్డి, చెట్కూరి తిరుపతి, కాసర్ల కనకరాజు, స్వప్న, ఎర్రోళ్ల మల్లేశం, కందుకూరి సిద్ధిలింగం, బోయిన సాయికుమార్, కొంగరి గిరిధర్, గడ్డం మహేశ్యాదవ్, పచ్చిమడ్ల సిద్ధిరాములు, నామిరెడ్డి సౌజన్య, సూటిపల్లి బుచ్చిరెడ్డి, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు పాల్గొన్నారు.
కట్నాలు చదివించిన మంత్రులు…
కొమురవెల్లి మల్లన్న కల్యాణానికి హాజరైన మంత్రి హరీశ్రావు రూ.1,00,116 కట్నం చదివించి వెంటనే నగదును ఆలయ అధికారులకు అందజేశారు. మంత్రులు తలసాని శ్రీనివాస్
యాదవ్, చామకూర మల్లారెడ్డి చెరో రూ.1,00,116, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి రూ.50,116, టీఎస్ఎంస్ఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ రూ.25,116,ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి రూ.25,116 ప్రకటించారు. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సోదరుడు శంకర్యాదవ్ రూ.50,116 కట్నం అందజేశారు.
శుభ ముహూర్తాన..
స్వస్తిశ్రీ శుభకృత్ నామ సంవత్సరం మార్గశిర మాసం దశమి ఆదివారం ఉదయం 10.45 గంటలకు కొమురవెల్లి పుణ్యక్షేత్రంలోని ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద గల కల్యాణ వేదికలో స్వామివారి కల్యాణం నిర్వహించారు.అంతకుముందు ఊరేగింపుగా వెళ్లి స్వామివారి తరపున మహదేవుని వంశస్తులు, పడిగన్నగారి వంశస్తులు కూర్చుని కల్యాణం జరి పించారు. స్వామివారి కల్యాణానికి తాళి, మట్టెలు, ఒడిబియ్యం, బట్టలు తీసుకువచ్చి మనువు చేశారు. మధ్యాహ్నం 12గంటలకు రుద్రాభిషేకం, సాయంత్రం శకటోత్సవం నిర్వహించారు.
స్వర్ణ కిరీటం సమర్పణ
గత కల్యాణం సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం ఆలయానికి సంబంధించిన 1570 గ్రాముల బంగారంతో తయారుచేసిన స్వర్ణ కిరీటాన్ని కల్యాణం అనంతరం స్వామి వారికి మంత్రి హరీశ్రావు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, కార్పొరేషన్ చైర్మన్లు వంటేరు ప్రతాప్రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.