సిద్దిపేట, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఓటు ఎంతో విలువైనది. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ. జనవరి 2023 నాటికి 18ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఇందు కోసం నేడు, రేపు ప్రత్యేక సదస్సులను అధికార యంత్రాంగం నిర్వహిస్తున్నది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారు. పోలింగ్ కేంద్రాలు లేదా గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద అందుబాటులో ఉండి కొత్తగా ఓటరు నమోదుకు, అభ్యంతరాలకు
దరఖాస్తులను స్వీకరిస్తారు. ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ను కొత్తగా ఓటరు నమోదు చేసుకునే వారి కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే జిల్లాలో పోలింగ్ బూత్ల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నెల 26, 27 తేదీల్లో, డిసెంబర్ 10, 11 తేదీలో కూడా స్పెషల్ డ్రైవ్లు నిర్వహించనున్నది. 18ఏండ్లు నిండిన వారందరూ ఓటరుగా దరఖాస్తు చేసుకోవడానికి ఫారం-6ను పూర్తి చేసి బూత్ స్థాయి అధికారికి ఇవ్వాలి. ఇందుకు రెండు పాస్ పోర్టు సైజ్ ఫొటోలతో పాటు వయస్సు ధ్రువీకరణ కోసం పదో తరగతి మెమో లేదా చదువుకోని వారు ఆధార్ కార్డు, లేదా నివాస ధ్రువ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నారై ఓటర్లను ప్రత్యేకంగా పేర్కొంది.
పోలింగ్ కేంద్రాల్లో ముసాయిదా ఓటర్ల జాబితా
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు జాబితాను ప్రదర్శించారు. ఓటర్లు తమ పేరును సరి చూసుకుంటున్నారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇలా అన్ని పోలింగ్ కేంద్రాల్లోను ఓటర్ల జాబితాను ప్రదర్శించడంతో తమ పేరును చూసుకొని, ఏమైనా సవరణలు ఉంటే పోలింగ్ బూత్ అధికారులకు ఫారం నింపి ఇస్తున్నారు. కాగా, నేడు, రేపు రెండు రోజులు పాటు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 9న అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలను స్థానిక ఆర్డీవో, తహసీల్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. ప్రత్యేకంగా నూతన ఓటరు నమోదుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
1 జనవరి 2023 నాటికి 18ఏండ్లు నిండిన వారు 08-12-2022 వరకు ఫారం-6 ద్వారా బూత్లెవల్ అధికారికి అందించాలి. లేదా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో NVSP(NATIONAL VOTER SERVICE PORTAL) లేదా VHA (VOTER HELPLINE APPLICATION) ద్వారా చేసుకోవచ్చు. ఓటరు నమోదులో ఏమైనా ఆక్షేపణలు, తొలిగింపులు ఉన్నట్లయితే ఫారం-7లో సమర్పించవచ్చు. కాగా, రాష్ట్ర ఎన్నికల సంఘం నెల 26, 27 తేదీలతో పాటు డిసెంబర్ 10, 11 తేదీల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నది. ఆ రోజుల్లో నూతన ఓటరు నమోదుతో పాటు సవరణలు, తొలిగింపులకు సంబంధించిన దరఖాస్తులను బూత్లెవల్ అధికారులకు ఇవ్వవచ్చు అని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. తుది ఓటర్ల జాబితాను జనవరి 5వ తేదీన ప్రచురిస్తారు. జిల్లాలోని అందరూ ఓటర్లు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల సంఘం తెలిపింది.