సిద్దిపేట, జూన్ 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మెదక్ జిల్లాలో అర్హులైన నిరుపేదలకు రేషన్ కార్డులను పంపిణీ చేయాలని అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తద్వారా మరింత మందికి ఆహార భద్రత కలగనుంది. సీఎం కేసీఆర్ తీపికబురు అందించడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి వచ్చే 15 రోజుల్లోగా కార్డులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆధికారులను ఆదేశించారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో కలిపి మొత్తం 28,163 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వీరిలో అర్హులందరికీ రేషన్ కార్డులు రానున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రూపాయికే కిలో బియ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రతి వ్యక్తికి 6 కిలోల బియ్యాన్ని ఇస్తున్నది. కుటుంబంలో ఎంత మంది కుటుంబ సభ్యులుంటే అంత మందికి ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నది. దీంతో పేదలకు ఆహార భద్రత ఏర్పడింది.
సిద్దిపేట జిల్లాలో…
సిద్దిపేట జిల్లాలో 8,025 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. 16,500 మంది మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో 680 రేషన్ షాప్లు ఉన్నాయి. 2,87,879 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో ఆహార భద్రత కార్డులు 2,68,989 ఉండగా, అంత్యోదయ కార్డులు 18,790. అన్నపూర్ణ కార్డులు 93 ఉన్నాయి. ప్రతినెలా 5,771 టన్నుల బియ్యాన్ని లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్నది.