గజ్వేల్, మార్చి 30 :కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కాల్వ ద్వారా హల్దీవాగుకు అనుసంధానం చేసే కాల్వ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో వారం రోజుల్లో నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం చౌదర్పల్లి బంధం చెరువులోకి సంగారెడ్డి కాల్వ నుంచి గోదావరి నీటిని నింపి, అక్కడి నుంచి వర్గల్ పెద్ద చెరువు, అంబర్పేట ఖాన్ చెరువు వరకు ప్రత్వేక కాల్వను తవ్వి హల్దీవాగుకు అనుసంధానం చేస్తున్నారు. కాల్వ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కాగా, అక్కడక్కడా మత్తళ్లు, రోడ్డు బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయి. హల్దీవాగు ద్వారా మంజీరాలోకి అవసరం ఉన్నప్పుడు గోదావరి నీటిని విడిచి, నిజాంసాగర్ వరకు కాళేశ్వరం ఎత్తిపోతల నీటిని పారించడానికి అనుకూలంగా ఈ కాల్వను నిర్మిస్తున్నారు. కాగా, ఇటీవల కూడవెల్లి వాగులోకి గోదావరి నీరు విడుదల చేయడంతో చెక్డ్యాంలు మత్తళ్లు దుంకుతున్నాయి. త్వరలో హల్దీవాగులోకి గోదావరి నీటిని సీఎం సూచనల మేరకు వదులుతామని మంత్రి హరీశ్రావు ప్రకటించారు.
అద్భుత ఘట్టానికి సమీపిస్తున్న గడియలు..
కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నీటితో హల్దీ, మంజీరాలను జీవనదులుగా మార్చడానికి సీఎం కేసీఆర్ రూపొందించిన మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతానికి సమయం సమీపిస్తున్నది. గజ్వేల్ నియోజకవర్గంలో అత్యధిక దూరం ప్రవహిస్తూ మంజీరా నదిలో కలసే హల్దీవాగుకు గోదావరి జలాలను అందించే ప్రత్యేక కాల్వ పనులు చివరి దశకు చేరుకున్నాయి. వారం రోజుల్లో ఈ కాల్వ పనులు పూర్తి కానుండగా, హల్దీవాగులోకి గోదావరి జలాలను వదలనున్నారు. సంగారెడ్డి కాల్వను హల్దీవాగుకు అనుసంధానం చేస్తూ సుమారు 6కిలోమీటర్ల ప్రత్యేక కాల్వను నిర్మిస్తున్నారు. ఈ కాల్వ కోతకు గురికాకుండా మధ్యమధ్యలో సిమెంట్ మత్తళ్లను నిర్మిస్తున్నారు. రహదారులపై బ్రిడ్జిల నిర్మాణం పూర్తికావచ్చాయి. కొండపోచమ్మసాగర్ నుంచి సంగారెడ్డి కాల్వ 6.2కిలోమీటర్ వద్ద నుంచి వర్గల్ మండలం చౌదర్పల్లి బంధం చెరువు వరకు ప్రత్యేక కాల్వను నిర్మించారు. ఈ కాల్వ ద్వారా బంధం చెరువును గోదావరి నీటితో నింపడంతో మత్తడి పారుతుంది. అక్కడ నుంచి వర్గల్ పెద్ద చెరువు, అంబర్పేట ఖాన్ చెరువు వరకు సుమారు 6కిలోమీటర్ల కాల్వను అవసరం ఉన్న మేరకు తవ్వారు. సంగారెడ్డి కాల్వ ద్వారా బంధం చెరువులోకి జలాలు చేరి, అక్కడ నుంచి వర్గల్ పెద్ద చెరువులోకి, అక్కడ నుంచి ఖాన్చెరువులోకి గోదావరి జలాలు చేరడంతో హల్దీవాగుకు అనుసంధానం అవుతుంది. ఖాన్ చెరువు మత్తడి పారితే హల్దీవాగు పారి నాచగిరి, తూప్రాన్ ద్వారా హల్దీ ప్రాజెక్టుకు చేరి, అక్కడి నుంచి ఏడుపాయల వద్ద మంజీరా నదిలో కాళేశ్వరం ఎత్తిపోతల గోదావరి జలాలు కలుస్తాయి.
ఏడాది పొడవునా..
హల్దీవాగులోకి ఏడాది పొడవునా కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీటిని వదలడానికి వీలుగా 1600 క్యూసెక్కుల సామర్థ్యంతో ప్రత్యేక కాల్వను నిర్మిస్తున్నారు. కాల్వ నిర్మాణం పూర్తికాగా, రోడ్డు కమ్ బ్రిడ్జి పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ కాల్వ కోతకు గురికాకుండా అక్కడక్కడా 11సిమెంట్ మత్తళ్లను నిర్మిస్తునారు. ఈ మత్తళ్ల నిర్మాణం పూర్తి కావచ్చాయి. చెరువుల అలుగు వద్ద ప్రత్యేక వంతెనలను నిర్మిస్తున్నారు. కాల్వ ద్వారా మంజీరాలోకి ఎప్పుడు నీరు అవసరం ఉంటే అప్పుడు వదలడానికి వీలుగా, హల్దీవాగుపై ఉన్న చెక్డ్యాంలు అవసరం ఉన్నప్పుడు గోదావరితో నింపుకొనే వీలుంటుంది. గతంలో వానకాలంలో వానలు కురిసి వరద వస్తేనే హల్దీవాగు పారేది. గతంలో ఎన్నో ఏండ్లు హల్దీవాగుకు వరద రాక వానకాలంలో కూడా చెక్డ్యాంలు నిండకపోవడంతో పరిసర ప్రాంత వ్యవసాయ భూములు బీడుగా మారాయి. హల్దీవాగుతో పాటు మంజీరా పరీవాహక ప్రాంతమంతా ఏటా ఇక రెండు పంటలకు పుష్కలంగా నీరు సమకూరనుంది.
కూల్డ్రింక్స్ అధికంగా తాగితే డేంజరే..!
కాబోయే అమ్మలు.. టీకాలకు సిద్ధం!