కొవిడ్ మహమ్మారి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న లాక్డౌన్ ఉమ్మడి మెదక్ జిల్లాల్లో పకడ్బందీగా కొనసాగుతున్నది. నిబంధనలను పోలీసు యంత్రాంగం కఠినంగా అమలు చేస్తున్నది. అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నది. సరైన కారణమేదీ లేకుండా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేయడంతోపాటు, వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులో మరింతగా నిఘాను పెంచారు. కొన్ని ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తున్నారు. సిద్దిపేట సీపీ జోయల్ డెవిస్, సంగారెడ్డి ఎస్పీ చంద్ర శేఖర్రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి లాక్డౌన్ను పక్కాగా అమలయ్యేలా చూస్తున్నారు. కొన్ని చోట్ల మఫ్టీలో పోలీసులు తిరుగుతూ లాక్డౌన్ను పర్యవేక్షిస్తున్నారు. ఈ 15 రోజుల్లో లాక్డౌన్ ఉల్లంఘనకు సంబంధించి సిద్దిపేట జిల్లాలో 2,475 కేసులు నమోదు చేసి 428 వాహనాలు సీజ్ చేశారు. సంగారెడ్డిలో 4,123, మెదక్లో 4,451 కేసులు నమోదు చేసి 1,333 వాహనాలను సీజ్ చేశారు.
సిద్దిపేట, మే 26 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి) :
కరోనా మహమ్మరిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ ఉమ్మడి జిల్లాలో పక్కాగా అమలవుతున్నది. జిల్లాల్లో మరింత కట్టుదిట్టం చేయడంతో ప్రజానీకం ఇండ్లకే పరిమితమవుతున్నది. దీంతో కరోనా కేసులూ తగ్గుతున్నాయి. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు జిల్లాను సందర్శించి లాక్డౌన్ అమలు తీరును పరిశీలిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులో మరింత నిఘా పెంచారు. కరోనా ఉల్లంఘనలు, అనుమతులు లేకుండా తిరిగే వాహనాలను సీజ్ చేస్తున్నారు. సిద్దిపేట సీపీ జోయల్ డెవిస్, సంగారెడ్డి ఎస్పీ చంద్ర శేఖర్రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి లాక్డౌన్ను పక్కాగా అమలయ్యేలా చూస్తున్నారు. పోలీసు అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. కొన్నిచోట్ల మఫ్టీలో పోలీసులు తిరుగుతూ లాక్డౌన్ను పర్యవేక్షిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల సహాయంతో మరింతగా నిఘా పెంచారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన దుకాణా యజమానులపై కేసలు నమోదు చేస్తున్నారు. నిత్యావసర సరుకులను అధిక రేట్లకు అమ్మే వ్యాపాలరుపై ఓ కన్నేసి ఉంచారు. ఎక్కడైనా అధిక ధరలకు అమ్ముతున్నట్లు సమాచారం రాగానే, వెంటనే అక్కడికి వెళ్లి, సంబంధింత వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. లాక్డౌన్లో ఎవరిని కూడా అనుమతించడం లేదు. అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తున్నారు. దీంతో ప్రజలు చాలా వరకు ఇంటికే పరిమితం అవుతున్నారు. లాక్డౌన్ సడలింపు సమయంలో వారికి కావాల్సిన సరుకులను కొని తెచ్చుకుంటున్నారు. లాక్డౌన్ ఉల్లంఘించిన వారు, లాక్డౌన్ సడలింపు సమయంలో మాస్కులు ధరించక, భౌతికదూరం పాటించని వారిపై ఈ 15 రోజుల్లో ఇప్పటి వరకు సిద్దిపేట జిల్లాలో 188 ఐపీసీ యాక్టు కింద 2,475 కేసులను నమోదు చేశారు. 428 వాహనాలను సీజ్ చేశారు. ఈ పాస్ ద్వారా ఆన్లైన్లో 3,572 పాసులను ఇచ్చారు. సంగారెడ్డి జిల్లాలో 4,123 కేసులు నమోదు కాగా, ఆన్లైన్లో 2,173 పాసులను, మెదక్ జిల్లాలో 613 ఆన్లైన్ పాసులను ఇచ్చారు. 4,451 కేసులు నమోదు చేసి 1,333 వాహనాలను సీజ్ చేశారు. ఎక్కడికక్కడ చెక్పోస్టులను పెట్టి మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. జిల్లా సరిహద్దులో చెక్పోస్టులు వద్ద మరింత నిఘాను పెట్టారు. ఉమ్మడి జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో లాక్డౌన్తో అన్ని రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఇక కరోనా కట్టడికి ఆర్థిక మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్య సేవలందించడంతో పాటు పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలో సైతం ఐసొలేషన్ వార్డులను సైతం ఏర్పాటు చేశారు. పట్టణాలు, గ్రామాల్లో తొలి విడుత జ్వర సర్వేను పూర్తి చేసి, రెండోవిడుత సర్వేను సైతం ప్రారంభించారు. రెండు, మూడు రోజులుగా జిల్లాలో ముమ్మరంగా సర్వే కొనసాగుతున్నది. గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఆయా కేంద్రాల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తున్నారు.