గజ్వేల్ రూరల్, ఏప్రిల్7: మల్లన్నసాగర్ ప్రాజెక్టులో ముంపునకు గురైన తొగుట మండలం వేములఘాట్, పల్లెపహాడ్ గ్రామాలకు చెందిన భూనిర్వాసిత కుటుంబాలు ఇండ్లను ఖాళీ చేస్తున్నాయి. గజ్వేల్ సమీపంలోని ముట్రాజ్పల్లి వద్ద నిర్మించిన ఆర్అండ్ఆర్ కాలనీలో రెండు గ్రామాల భూనిర్వాహితులు బుధవారం సామూహిక గృహప్రవేశాలు చేశారు. సంబురంగా కొత్తిండ్లలో పూజలు చేసి, పాలు పొంగించారు. ఆదివారం కొంతమంది రాగా, బుధవారం మరిన్ని కుటుంబాలు కాలనీకి వచ్చాయి. సంతోషంతో ఇంటి ఆడపడచులతో కడపలు కడిగించి ఇంట్లోకి అడుగు పెడుతున్నారు. నిర్వాహితుల కుటుంబాల రాకతో ఆర్అండ్ఆర్ కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. ముట్రాజ్పల్లి వద్ద 600 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన 2500 ఇండ్లను ఆయా గ్రామాల భూనిర్వాహితులకు కేటాయించారు. బుధవారం ఆయా గ్రామాలకు చెందిన నిర్వాసిత కుటుంబాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కుటుంబ సభ్యులతో కలిసి ఆర్అండ్ఆర్ కాలనీకి చేరుకున్నాయి.
కొత్తిండ్లలోకి చేరుకున్న తర్వాత ముందుగా ఆడపచులచే కడపలు కడిగించి, గుమ్మాలకు తోరణాలు, పూల దండలు వేసి గుమ్మడి కాయలు, టెంకాయలు కొట్టి, కొత్తింట్లోకి ప్రవేశించారు. బంధువులు, సహ కుటుంబ సభ్యులతో కలిసి పాలుపొంగించారు. వారం రోజుల క్రితం ఆర్అండ్ఆర్ కాలనీలో ముంపు గ్రామస్తులకు కేటాయించిన ఇండ్లను అధికారులు శుభ్రం చేయించారు. మౌలిక సదుపాయాలు కల్పించడంతో నిర్వాసితులు కొత్తిండ్లలోకి చేరుకుంటున్నారు. వారం రోజులుగా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి ఆర్అండ్ఆర్ కాలనీలో అసంపూర్తిగా మిగిలిన పనులు పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టారు. దీనికోసం 11 బృందాలను ఏర్పాటు చేసి పనులు త్వరితగతిన పూర్తిచేయిస్తున్నారు. గృహ ప్రవేశాల్లో అధికారులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండీ…
ఉగాది ఉత్తమ పాత్రికేయ పురస్కారాలు
రైల్వే చక్రబంధం నుంచి విముక్తి