Air India Express : ఉత్తర ప్రదేశ్, వారణాసి ఎయిర్పోర్టులో షాకింగ్ ఘటన జరిగింది. ఒక ప్యాసింజర్ గన్ తీసుకెళ్తుండగా, అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఉన్నట్లుండి గన్ పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఈ ఘటన జరిగింది. అజాంగడ్కు చెందిన కమ్లీష్ రాయ్ అనే ప్రయాణికుడు తన భార్యతో కలిసి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఐఎక్స్-1810 అనే విమానంలో ముంబై వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు వచ్చాడు.
ఎయిర్పోర్టులో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో తన వద్ద ఒక గన్, మ్యాగజైన్ ఉన్నాయని అతడు అధికారులకు తెలిపాడు. ఈ క్రమంలో గన్ను పరిశీలిస్తుండగా ఆ గన్ పేలింది. అయితే, ప్రయాణికుడే గన్ పేల్చి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అది ప్రమాదవశాత్తు కూడా జరిగి ఉండచ్చని భావిస్తున్నారు. గన్ ఒక్కసారిగా పేలి, ఒక బుల్లెట్ బయటకు వచ్చింది. ఈ ఘటనలో అక్కడే ఉన్న తనిఖీ నిర్వహించే సిబ్బంది ఇద్దరు గాయపడ్డారు. వారిలో ఒక మహిళ కూడా ఉన్నారు. మొదట నేలను తాకిన బుల్లెట్ ఆ తర్వాత ఇద్దరిని తాకుతూ వెళ్లింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి చేతికి గాయంకాగా, మరో మహిళ తొడకు గాయమైంది. ఈ ఘటన జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది స్పందించారు.
గాయపడిన ఇద్దరిని న్యూలక్ష్మీ ట్రామా సెంటర్కు చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోందని వారణాసి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ పునీత్ గుప్తా తెలిపారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు అధికారులు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఎయిర్పోర్టుకు 2005లో లాల్ బహదూర్ శాస్త్రి పేరు పెట్టారు. దేశంలోని అత్యంత రద్దీ ఎయిర్పోర్టుల్లో ఇదీ ఒకటి.