Dimagi Naxals Janatha Party | సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. మొన్నటి వరకు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అనే పదం నెట్టింట తెగ హల్చల్ చేయగా, తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ‘దీమాగీ నక్సల్స్ జనతా పార్టీ’ (Dimagi Naxals Janatha Party) అనే పదం తెరపైకి వచ్చి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. జెన్-జీ (Gen-Z) యువతను ప్రస్తావిస్తూ, దేశంలో నక్సలిజం అంతమైపోయిందనుకుంటున్న తరుణంలో కొత్తగా ‘దిమాగీ నక్సల్స్’ (Dimagi Naxals) తయారవుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనూ, యువతలోనూ తీవ్ర దూమారాన్ని రేపాయి. అయితే గతంలో దేశంలో బొద్దింకలు ఎక్కువయ్యాయని సుప్రీంకోర్టు ప్రధాన ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించిన సందర్భాన్ని గుర్తుచేస్తూ నెటిజన్లు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ని ఏర్పాటు చేసి, నీట్ (NEET) పరీక్షల కోసం పోరాడి ఏకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రినే గద్దె దించే వరకు వెళ్లిన ఉదంతాన్ని గుర్తుచేస్తున్నారు.
ఇక తాజాగా ప్రధాని మోదీ యువతను ఉద్దేశించి సానుకూల వ్యాఖ్యలు చేయాల్సింది పోయి, వారిని ‘దిమాగీ నక్సల్స్’ అనడం యువతకు అసలు మింగుడుపడటం లేదు. దీంతో ప్రధాని వ్యాఖ్యలపై నిరసన తెలుపుతూ కొందరు నెటిజన్లు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ తరహాలోనే సోషల్ మీడియాలో ‘దీమాగీ నక్సల్స్ జనతా పార్టీ’ పేరుతో ప్రత్యేక ఐడీలను క్రియేట్ చేయడమే కాకుండా, ప్రత్యేక హ్యాష్ట్యాగ్లతో ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఈ వ్యంగ్య ధోరణి, నిరసనలు రాబోయే రోజుల్లో ఏ స్థాయికి చేరుకుంటాయనేది వేచి చూడాల్సి ఉంది.