రాయపోల్ ఆగస్టు 22 : గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామ గ్రామానికి చెత్త ట్రాక్టర్లును అందించి గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి గ్రామాలు అందంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంది. కానీ కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో పారిశుద్ధ పనులు కొనసాగడం లేదు. చెత్త ట్రాక్టర్లకు డీజిల్ కొరత ఉండడంతో అవి కూడా నడవడం లేదు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని తిమ్మక్కపల్లి గ్రామంలో గత 20 రోజుల నుంచి చెత్త ట్రాక్టర్ నడవకపోవడంతో ఎక్కడి చెత్తా అక్కడనే ఉండడంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది.
కనీసం ట్రాక్టర్ కు డీజిల్ పోయించుకోలేని స్థితిలో గ్రామపంచాయతీ ఉండడంతో గ్రామస్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తే గ్రామాల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని గ్రామస్తులు అన్నారు. రాత్రిపూట వీధి దీపాలు వెలగకపోవడంతో అంధకారంలో ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అలాగే ప్రధాన వీధుల్లో మురికి కాలువలు ఎప్పటికప్పుడు తీయకపోవడంతో దోమలతో రోగాల బారిన పడుకతున్నామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తిమ్మక్కపల్లి గ్రామంలో నెలకొన్న పారిశుధ్య సమస్యలు పరిష్కరించి వీధి దీపాలు వేయించి మురికి కాలువలు పరిశుభ్రంగా ఉండే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు పేర్కొన్నారు. తమ గ్రామానికి పర్మనెంట్ పంచాయతీ కార్యదర్శి నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు.