న్యాల్కల్, ఆక్టోబర్ 18: శాసనసభ ఎన్నికల సందర్భంగా ముందస్తు భద్రత చర్యలో భాగంగా పొరుగు రాష్ర్టాల నుంచి తెలంగాణలోకి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని సంగారెడ్డి ఎన్నికల అధికారి, కలెక్టర్ శరత్, ఎస్పీ చెన్నూరి రూపేశ్ అన్నారు. బుధవారం మండలంలోని తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల సరిహద్దులోని హుస్సేల్లి, మల్గి గ్రామాల సమీపంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టులను వారు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా చెక్పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు, రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. ఈ చెక్పోస్టుల వద్ద 24 గంటల ప్రత్యేక నిఘ ఉంచాలన్నారు.
పొరుగు రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలన్నారు. ఆయా రాష్ర్టాల నుంచి డబ్బు, మద్యం, ఇతర విలువైన వస్తువులు రాకుండా చూడాలన్నారు. సరైన పత్రాలు లేకుంటే సీజ్ చేయాలన్నారు. సరిహద్దు చెక్పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. విడతలు వారీగా విధులు నిర్వహి స్తూ, వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. చెక్పోస్టుల వద్ద విధులు నిర్వహించే సిబ్బందికి సరైన వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు. చెక్పోస్టులతో పాటు సరిహద్దు గ్రామాలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. వారి వెంట అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రాజిరెడ్డి, ఎంపీడీవో వెంకట్రెడ్డి, జహీరాబాద్ రూరల్ సీఐ వెంకటేశ్, హద్నూర్ ఎస్సై రామానాయుడు, మల్గి సర్పంచ్ మారుతీయాదవ్ తదితరులు ఉన్నారు.
నారాయణఖేడ్లో..
నారాయణఖేడ్, అక్టోబర్ 18: నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు సంగారెడ్డి జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శరత్ తెలిపారు. బుధవారం కలెక్టర్, ఎస్పీ రూపేశ్కుమార్తో కలిసి నారాయణఖేడ్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించామన్నారు. రాష్ట్ర సరిహద్దులో తొమ్మిది చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించి, వాటిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. నారాయణఖేడ్లోని స్ట్రాంగ్రూం, పోలింగ్ కేంద్రాలను వారు పరిశీలించారు. నాగల్గిద్ద మండలం మోర్గి వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టును తనిఖీ చేసి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. మనూరు మండలం బెల్లాపూర్లోని సమస్మాత్మక పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. వారి వెంట నారాయణఖేడ్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో వెంకటేశం, స్థానిక డీఎస్పీ వెంకట్రెడ్డి ఉన్నారు.
ఎన్నికల సామగ్రి పంపిణీకి ఏర్పాట్లు చేయాలి
జహీరాబాద్, అక్టోబర్ 18: ఎన్నికలు ప్రశాతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని, పోలింగ్ బూత్లు, ఈవీఎంల గోదాం వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శరత్ సూచించారు. బుధవారం జహీరాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈవీఎం గోదాం, ఈవీఎంల పంపిణీ కేంద్రం, పోలింగ్ బూత్లు, అంతర్ రాష్ర్ట సరిహద్దు చెక్పోస్టులను పరిశీలించాలని సూచనలు చేశారు. కర్ణాటక, మహారాష్ర్టాల నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి డబ్బు, మద్యం, గంజాయి సరఫరా కాకుండా ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. కలెక్టర్ వెంట ఎస్పీ రూపేశ్, అడిషనల్ ఎస్పీ అశోక్, జహీరాబాద్ ఆర్డీవో నియోజకవర్గ ఎన్నికల అధికారి వెంకారెడ్డి, డీఎస్పీ రఘు, రవాణా శాఖ చెక్పోస్టు ఇన్చార్జి శ్రీనివాస్గౌడ్, పట్టణ సీఐ రాజు, మున్సిపల్ కమిషనర్ సుభాశ్రావు, జహీరాబాద్, మొగుడంపల్లి ఎంపీడీవోలు సుమతి, మహేశ్, జహీరాబాద్ పట్టణ ఎస్సై శ్రీకాంత్, చెరాగ్పల్లి ఎస్సై నరేశ్, అధికారులు ఉన్నారు.