తొగుట, మే 06 : సీఎం కేసీఆర్ చొరవతోనే స్వరాష్ట్రంలో పల్లెసీమలు బలపడుతున్నాయని మెదక్ ఎంపీ, జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని వర్ధరాజ్పల్లిలో జరుగుతున్న పెద్దమ్మ తల్లి ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి పల్లె సీమలు పట్టుకొమ్మలని ఆనాడు గాంధీజీ చెప్పిన నినాదాన్ని నేడు సీఎం కేసీఆర్.. నూతన పంచాయతీరాజ్ చట్టం తేవడంతో పాటు ప్రత్యేక నిధులు కేటాయించి నిజం చేశారన్నారు. సీఎం కేసీఆర్ చొరవతోనే చెరువు, కుంటలు పునరుద్ధరణ, ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టరన్నారు.
24 గంటల కరెంటు, రైతు బీమా, రైతు బంధు పథకాలతో రైతులను ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. ఏ గ్రామంలోకి వెళ్లినా గ్రామ దేవతల పండుగలతో సంతోషకరమైన వాతావరణం నెలకొందన్నారు. కేంద్రం సహకరించకున్నా స్వశక్తితో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు.
ఈసందర్భంగా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఎంపీని ఘనంగా సన్మానించారు.
అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు వంగాల తిరుపతిరెడ్డిని ఆయన పరామర్శించారు. మెరుగైన వైద్య సహాయం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.