గజ్వేల్ అర్బన్, జనవరి 14: గజ్వేల్ పట్టణంలో నాలుగు రోజులుగా సాగుతున్న 49వ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ క్రీడాపోటీలు ఆదివారం ముగిసాయి. ఈ పోటీల్లో 33 జిల్లా ల నుంచి బాలుర, బాలికల జట్లు పాల్గొన్నాయి. జూనియర్ బాలికల విభాగంలో రంగారెడ్డి జిల్లా జట్టు 42 పాయింట్లు సాధించగా, నల్గొండ జట్టు 55 పాయింట్లు సా ధించి 13 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జూనియర్ బాలుర విభాగంలో నల్గొండ జట్టు 27 పాయింట్లు సాధించగా, రంగారెడ్డి 34 పాయింట్లతో విన్నర్గా నిలిచింది.
ఫైనల్ కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగగా నిర్వాహకులు, అతిథులు, ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతతో వీక్షించారు. కాగా, విన్నర్, రన్నర్ జట్లకు మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, మాజీ టీడీసీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, రాష్ట్ర ఒలింపిక్, కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్యాదవ్, మహిళా కమిషన్ చైర్పర్సన్ దండుగుల రాజ్యలక్ష్మి, జిల్లా అధ్యక్షుడు ఎన్సీ సంతోష్, ప్రధాన కార్యదర్శి శివకుమార్ తదితరులు ట్రోఫీలను అందజేశారు. క్రీడాపోటీల నిర్వహణకు కృషి చేసిన జిల్లా కబడ్డీ అసోసియేషన్ను, ఏర్పాట్లకు సహకరించిన మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, పోలీసు, వైద్య, విద్యుత్ తదితర శాఖలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.