సిద్దిపేట అర్బన్, జూన్ 20 : ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజల నుంచి జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)తో కలిసి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎంతో ఆశతో తమ సమస్యలు తీరుతాయని ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు వస్తారని.. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలన్నారు.
ఇందులో భాగంగా సిద్దిపేట పట్టణం గణేష్నగర్కు చెందిన పిన్నం రాజమౌళి అనే దివ్యాంగుడు తనకు వినికిడి లోపం ఉందని, యంత్రం ఇవ్వాల్సిందిగా కోరగా జిల్లా కలెక్టర్ వయో వృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా అప్పటికప్పుడే తెప్పించి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చెన్నయ్య, కలెక్టరేట్ ఏఓ రెహమాన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.