తొగుట : పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి భరోసా ఇచ్చారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేటకు చెందిన బీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక కార్యకర్త మహ్మద్ అన్వర్ హుస్సేన్ ఇటీవల ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎల్లారెడ్డిపేటలోని అన్వర్ కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
అన్వర్ బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తుచేశారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలిపారు. కార్యకర్తలే పార్టీకి బలం అని పేర్కొన్న ఎమ్మెల్యే, అన్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు భవిష్యత్తులోనూ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ వేల్పుల స్వామి, గ్రామ పార్టీ అధ్యక్షులు నందారం వెంకటేష్ గౌడ్, నాయకులు బోధనం కనకయ్య, బండారు స్వామి గౌడ్, కర్ణాకట్ రెడ్డి, జహంగీర్, నీరజ్, అహ్మద్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.