సిద్దిపేట : బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ కూడా అధైర్యపడవద్దని, ధైర్యంగా ఉండాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Mla Harish Rao) కోరారు. గురువారం సిద్దిపేటలో క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని నంగునూరు, చిన్నకోడూరు, సిద్దిపేట అర్బన్, రూరల్, సిద్దిపేట మున్సిపాలిటీ, నారాయణరావుపేట, గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండలంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
‘మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి సార్’ అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దివ్యాంగులు, ఆటో రిక్షా కార్మికులు, తదితరులు హరీశ్రావును కలిసిన వారిలో ఉన్నారు. వారి వారి గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్లతో పాటు ఇతర పార్టీలకు వచ్చిన వివరాలను విన్నవించారు. వరుసగా సిద్దిపేట నుంచి ఏడవ సారీ విజయం సాధించడం పట్ల పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్రావు మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్య పడవద్దని సూచించారు.