హుస్నాబాద్, నవంబర్ 10 : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు నడుం బిగించాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు రైతుల అభివృద్ధే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు సాగునీటి సౌకర్యం కోసం ప్రాజెక్టులు నిర్మించి పంటల ఉత్పత్తిని రెట్టింపు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరిపంటను కొనుగోలు చేయమని చెప్పడం కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమన్నారు.
కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి యాసంగిలోనూ రైతులు పండించిన పంటను కొనుగోలు చేసేలా ఒప్పించేందుకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారని చెప్పారు. 12వ తేదీన హుస్నాబాద్లో జరుగబోయే మహాధర్నాకు నియోజకవర్గంలోని ఏడు మండలాల రైతులు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో జడ్పీ వైస్చైర్మన్ రాజిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, వైస్చైర్పర్సన్ అయిలేని అనితారెడ్డి, ఎంపీపీలు మానస, మాలోతు లక్ష్మి, జడ్పీటీసీ భూక్య మంగ, మార్కెట్ చైర్మన్ కాసర్ల అశోక్బాబు, తదితరులు పాల్గొన్నారు.