మిరుదొడ్డి (అక్బర్పేట-భూంపల్లి), మే 4: మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను, తెలంగాణకు ఏమిచేయని బీజేపీని ఎంపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా శనివారం అక్బర్పేట-భూంపల్లి మండల కేంద్రంలో రోడ్షో, కార్నర్ మీటింగ్ నిర్వహించారు. దుబ్వాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 3న రూ.2 లక్షల రుణమాఫీ, 6 గ్యారెంటీల్లో మహాలక్ష్మి, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, రూ 4వేలు పింఛన్, తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక కొత్త పథకాలు దేవుడెరుగు ఉన్న పథకాలు మూలన పడ్డాయని ఎద్దేవా చేశారు. కూడవెల్లి వాగులోకి గోదావరి నీళ్లను విడుదల చేసి పంటలను ఆదుకున్న చరిత్ర కేసీఆర్దే అన్నారు. తన ప్రాణాలను సైతం తెలంగాణ తెచ్చిన కేసీఆర్పై అవాకులు చెవాకులు పేలుతున్న కాంగ్రెసోళ్లకు ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు.
దుబ్బాక ఉప ఎన్నికలప్పుడు అనేక హామీలిచ్చి మోసం చేసిన రఘునందన్రావుకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. మరోసారి ఎంపీ ఎన్నికల్లో ఆయన మీ ముందుకు వస్తున్నాడని, ఓట్లతో తగిన బుద్ధి చెప్పాలన్నారు. కలెక్టర్గా ఉన్నప్పుడు జిల్లా అభివృద్ధికి పి.వెంకట్రామిరెడ్డి ఎంతో కృషిచేశారన్నారు. ఇప్పుడు ఆయన మీకు సేవచేయడానికి ముందుకు వస్తున్నాడని, ప్రజలందరూ ఆశీర్వదించి ఆయనకు ఘన విజయం కట్టబెట్టాలని హరీశ్రావు కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ అక్బర్పేట-భూంపల్లి మండల అధ్యక్షుడు జీడిపల్లి రవి, మనోహర్రావు, సోలిపేట సతీశ్రెడ్డి, కత్తి కార్తీక, వెంకట నర్సింహారెడ్డి, సొసైటీ చైర్మన్ కైలాసం, మిరుదొడ్డి మాజీ ఎంపీపీ కవితా శ్రీనివాస్గౌడ్, శ్రీనివాస్, నరేశ్ వెంకట్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
అభ్యర్థులను చూసి ఓటేయాలి
మెదక్ ఎంపీ ఎన్నికల్లో ఓటేసే ముందు ప్రజలు అభ్యర్థుల గుణగణాలను చూసి ఆలోచించి ఓటేయాలని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. కలెక్టర్గా పనిచేసిన సమయంలో ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు ఫీజులు చెల్లించానని, కేసీఆర్, హరీశ్రావు ఆశీర్వాదంతో ఎంపీగా పోటీచేస్తున్న తనను గెలిపించాలని కోరారు. తన ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతానన్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో 10 లక్షల మందికి ప్రమాద బీమా సౌక ర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు.
– మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి
గల్లీలో పనికి రాని వాడు..ఢిల్లీలో పనికొస్తాడా..;-దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి
గల్లీలో చిత్తుగా ఓడిపోయినవాడు ఢిల్లీలో ఎలా పనికొస్తాడని రఘునందన్రావును దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఎద్దేవా చేశారు. సొంతూరు బొప్పాపూర్లో చెల్లని రూపాయి రఘునందన్రావు మెదక్ ఎంపీగా ఎలా చెల్లుతాడన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలప్పుడు ఉచిత హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన రఘునందన్ను ఎంపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేసుకోవడానికి ధర్నాలు చేయాల్సిన కర్మ నేడు కాంగ్రెస్ పాలనలో ఏర్పడిందన్నారు. వెంకట్రామిరెడ్డికి ఘన విజయం అందించాలన్నారు.