వర్గల్/సిద్దిపేట : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నాచగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. హరిద్రానదిలో స్వామి వారి పుష్కరిణిలో భక్తులు వేకువజామునే కార్తీక స్నానాలు ఆచరించారు. అనంతరం లక్ష్మీనారసింహున్ని దర్శించుకున్నారు.
క్షేత్రంలోని సత్యనారాయణ స్వామి వ్రతమండపంలో 75 జంటలు సత్యనారాయణ స్వామి వ్రతాలను జరుపుకున్నారు. అలాగే లక్ష్మీనారసింహుడి ప్రధాన ఆలయంతో పాటు శివాలయం వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. కరోనా కారణంగా ఏడాది నుంచి నిలిచిపోయిన నిత్యాన్నదానాన్ని తిరిగి ఆదివారం ప్రారంభించారు.
ఆలయ ఉత్తరద్వారం వద్ద గల అన్నదాన సత్రంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు అన్నదానాన్ని ప్రారంభించారు.