హుస్నాబాద్, మార్చి 9: సింగరేణి సంస్థలో ఉద్యోగ నియామకాలకు విడుదలైన నోటిఫికేషన్లో హుస్నాబాద్ ప్రాంత నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని నిరుద్యోగులు ఎం నరేశ్, జే తిరుపతి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం హుస్నాబాద్లో సింగరేణి సంస్థ విడుదల చేసిన నోటిఫికేషన్ను చూపిస్తూ ఎం.రమేశ్, లక్పతి, హరీశ్, అరవింద్తో కలిసి వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింగరేణి సంస్థ 269 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేసిందని, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లగా హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాలు నాన్లోకల్ కింద చూపిస్తున్నాయని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాలను లోకల్కింద చూపిస్తూ గతంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న ఈ నాలుగు మండలాలను నాన్లోకల్ కింద చూపించడం వల్ల ఈ ప్రాంతంలో బీటెక్ తదితర సాంకేతిక విద్యపూర్తి చేసిన నిరుద్యోగులు అన్యాయానికి గురవుతున్నారని చెప్పారు. నాన్లోకల్ కింద 5శాతం ఉద్యోగాల కోసం దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటారని, దీని వల్ల ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదన్నారు. సిద్దిపేట జిల్లాలో కలిసి హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాలను సింగరేణి లోకల్ కిందికి మార్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ను వారు కోరారు.