సంగారెడ్డి, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : యాసంగి సీజన్ ప్రారంభమైనా సంగారెడ్డి జిల్లాలో వానకాలం ధాన్యం సేకరణ ఇంకా పూర్తి కాలేదు. జిల్లాలో 1,14,222 మంది రైతులు 1,51,359 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. వ్యవసాయశాఖ వానకాలం సీజన్లో 3,67,440 మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వస్తున్నదని అంచనా వేసింది. మార్కెట్లోకి 2,93,950 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తున్నదని వ్యవసాయశాఖ, పౌరసరఫరాలశాఖ అంచనా వేయగా, 2.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకున్నది.
198 కొనుగోలు కేంద్రాల్లో 1.68 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
సంగారెడ్డి జిల్లాలో 198 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఐకేపీ ద్వారా 85 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. పీఏసీఎస్ల ద్వారా 80, డీసీఎంఎస్ ద్వారా 33 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. 198 కొనుగోలు కేంద్రాల ద్వారా 2,93,950 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2,93,950 టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా అధికారులు కొనుగోళ్లు ప్రారంభించారు. ఇప్పటి వరకు 1,68,783 టన్నుల ధాన్యం సేకరించారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా 65,921 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. డీసీఎంఎస్, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల ద్వారా 1,02,86 టన్నుల ధాన్యం సేకరించారు. 2.93 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటివరకు 1.68 లక్షల టన్నుల ధాన్యం సేకరించారు. ఇంకా 1.25 టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంది. జిల్లాలో ధాన్యం సేకరణ దాదాపుగా పూర్తికావచ్చిందని చెబుతున్నారు. రైతుల నుంచి రూ.371కోట్ల విలువ చేసే ధాన్యం సేకరించగా, ఇప్పటి వరకు రైతులకు రూ.330.39 కోట్లు చెల్లించారు. రూ.41.44కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది.