మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 13 : పాల దిగుబడి, పశు సంపదను పెంచడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పాడి రైతుల కోసం పలు పథకాలను ప్రవేశ పెడుతున్నదని ఉమ్మడి మెదక్ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం లక్ష్మారెడ్డి అధ్యక్షతన మెదక్లోని పశుగణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పాడి సంపదలో ఉమ్మడి జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుపేందుకు వెటర్నరి, డీఎల్డీఏ, విజయ డెయిరీ శాఖల అధికారులతో ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు పేర్కోన్నారు. మూడు శాఖల అధికారులతో కలిసి ఉమ్మడి జిల్లాలోని ప్రతి గ్రామంలో పాడి రైతులకు అవగాహన కల్పించేందుకు శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాబోవు రోజుల్లో పాల కొరత ఉండకుండా పశు సంపదను పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సబ్సిడీలను ప్రకటిస్తున్నాయని చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగమైన పాల పరిశ్రమను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 4వ విడత జాతీయ కృతిమ గర్భాధారణ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 2023 మే 31 వరకు 52 వేల ఐవీలు వేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు.
పాల సేకరణ కేంద్రాల వద్ద అధిక రద్దీ ప్రాంతాల్లో ఐవీల కోసం రూపొందించిన వాల్ పోస్టర్లను అతికించాలని గోపాలమిత్రలకు సూచించారు. పశువుల ఆరోగ్య సమస్యలను పరిష్కారించేందుకు సంచార వాహనాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విజయ డెయిరీ డీడీ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే పథకాలను పొందాలనుకునే పాడి రైతులు విజయ డెయిరీకి పాలు పోయాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో గల పాల సంస్థల కంటే విజయ డెయిరీ మాత్రమే లీటర్కు అధిక ధర చెల్లిస్తున్నదన్నారు. ఉమ్మడి జిల్లాలో దళిత బంధు, ద్వారా గేదెలను కొనుగోలు చేసిన లబ్దిదారులు ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీకి పాలు పోసి ఆర్థికంగా వృద్ధి చెందాలన్నారు. ఈ సందర్బంగా జాతీయ కృతిమ గర్భాధారణకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా ఈవో డాక్టర్ రాంజీ, వెటర్నరీ ఏడీ వివేక్, డైరెక్టర్లు నర్సింహరెడ్డి, వెంకటేశం, శ్రీశైలం యాదవ్ గోపాలమిత్ర పర్యవేక్షకులు శ్రీనివాస్రెడ్డి, తుక్కారెడ్డి, అర్జునయ్య, భాస్కర్గౌడ్ తదితరులు పాల్గోన్నారు.