సర్కారు పాఠశాలలను బలోపేతం చేయడంతోపాటు విద్యార్థులకు మెరుగైన బోధన చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ‘మన ఊరు..మన బడి’ కార్యక్రమంతో సకల వసతులు కల్పించి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది. విద్యార్థులు చదవడం, రాయడంతోపాటు గణిత చతుర్విద అంశాల్లో సామర్థ్యాలు సాధించేలా కృషి చేస్తున్నది. రెండు మూడు సంవత్సరాలుగా ‘త్రీఆర్స్, మూలాల్లోకి వెళ్దాం’ వంటి కార్యక్రమాలు చేపట్టగా ఈ ఏడాది పఠనోత్సవానికి శ్రీకారం చుట్టింది. ‘ప్రతి విద్యార్థి చదివేలా చూడాలి’ అనే నినాదంతో ఈనెల 31వరకు క్యాంపెయిన్ నిర్వహించనున్నది. దీని కోసం జిల్లా విద్యాశాఖ అధికారులు కార్యాచరణ రూపొందించారు. ప్రతి రోజూ ఒక పీరియడ్ దీని కోసం కేటాయించనున్నారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు దీనిని అమలు చేసి అన్ని సబ్జెక్టుల్లో నైపుణ్యం పెంచనున్నారు.
– గజ్వేల్, జూలై 15
గజ్వేల్, జూలై 15 : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిని పెం పొందించే దిశగా ప్రభుత్వం రీడింగ్ చాలెంజ్ ప్రణాళికను అమలు చేయడంతో నేడు విజయవంతంగా కొనసాగుతున్నది. పాఠశాలల్లో ఉపాధ్యాయులు రోజూ ఒక పీరియడ్ లైబ్రరీలో రీడింగ్ చేసేలా విద్యార్థులకు మెళకువలు నేర్పిస్తున్నారు. విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించి వెనుకబడిన వారిని ప్రోత్సహిస్తూ పఠనోత్సవం (రీడింగ్) చేయిస్తున్నారు. జూన్ 26వ తేదీన ప్రారంభమైన రీడింగ్ కార్యక్రమం ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విజయవంతంగా కొనసాగుతున్నది. దీనిపై మండల, జిల్లా స్థాయి అధికారులు పాఠశాలను పర్యవేక్షిస్తూ విద్యార్థుల సామర్థ్యాన్ని తెలుసుకుంటున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న 22 కేజీబీవీల్లో 3496 మంది విద్యార్థులు, 956 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 72,532 మంది విద్యార్థులు, 18 ప్రభుత్వ పాఠశాలల్లో 2990, 14 మోడల్ పాఠశాలలో 7100 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల పఠన సామర్థ్యాన్ని పెంపొందించేలా జూన్ 26 నుంచి రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రారంభమైన పఠనాభివృద్ధి కార్యక్రమం ఈ నెల 31 వరకు కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రతి విద్యార్థి ధారళంగా చదవడం అలవాటుగా చేసుకోవడం.. చదువుతూ ఆనందం పొందడం.. స్వతంత్ర పాఠకులుగా ఎదగడం దీని ప్రధాన లక్ష్యం.
రోజూ ఉపాధ్యాయుడు విద్యార్థిలతో పది నిమిషాలపాటు బాహ్యపఠనం చేయించడం, చార్టులపై లేదా నల్లబల్లపై పదాలను రాసి ప్రదర్శించేలా చేయడం, గ్రంథాలయ పీరియడ్లో రోజూ విద్యార్థులతో కథల పుస్తకాలను చదివించడం, మూడురోజులు మాతృభాషలో మిగతా మూడురోజులు ఆంగ్ల భాషలోని కథల పుస్తకాలు చదివిస్తారు. ప్రార్థన సమయంలో ఇద్దరు లేదా ముగ్గురు విద్యార్థులతో పుస్తకాలు చదివిస్తారు. ప్రతి మూడో శనివారం తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటుచేసి వారికి పిల్లల ప్రతిభను తెలియజేసేలా కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రతి విద్యార్థి ‘చదివేలా చేద్దాం’ అంటూ ఉపాధ్యాయులు రోజూ తరగతి గదిలో విద్యార్థులతో తెలుగు, ఆంగ్లం, హిందీ చదివిస్తారు. విద్యార్థుల్లో పఠనాశక్తి తక్కువగా ఉన్న వారిని గుర్తించి, ఉపాధ్యాయులు పఠనం చేయిస్తున్నారు. ప్రత్యేకంగా పాఠశాలల్లో ఉన్న కథల పుస్తకాలను విద్యార్థులకు ఇంటికి ఇచ్చి అనర్గళంగా పఠనం చేసేవిధంగా ప్రోత్సహిస్తున్నారు. రోజూ విద్యార్థులతో చదివించిన అంశాలను తెలుసుకునేందుకు వీలుగా అన్ని తరగతుల వారిని కుర్చోబెట్టి తెలుగు, ఆంగ్లం, హిందీ చదివించి, మంచి నైపుణ్యం కనబర్చిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేస్తారు.
నైపుణ్యాభివృద్ధిపై లైబ్రరీ కేటాయింపు..
విద్యార్థుల్లో దాగిఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు వీలుగా ప్రత్యేంగా పాఠశాలల్లో రీడింగ్ గదులు, లైబ్రరీలను కేటాయించారు. లైబ్రరీల్లో కథల పుస్తకాలను అందుబాటులో ఉంచడంతో విద్యార్థులు వాటిని చదవుతున్నారు. రోజూ విద్యార్థులు కథల పుస్తకాలను చదవడంతో వారిలో నైపుణ్యాభివృద్ధి మెరుగుపడుతుంది. విద్యాశాఖ సూచించిన విధంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులు వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధను చూపిస్తున్నారు. దీంతో అందరూ ఒకేలా పాఠ్యాంశాలను చదివేలా దోహదపడుతుంది.
ఒకటి, రెండో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
ప్రాథమిక పాఠశాలల్లో చదువుకునే ఒకటి, రెండో తరగతి విద్యార్థులపై ఉపాధ్యాయు లు ప్రత్యేక శ్రద్ధను చూపిస్తూ అక్షరాలను గుర్తించే విధంగా వారికి మెళకువలు చెబుతున్నారు. ముఖ్యంగా రెండక్షరాల పదాలను చదివించిన తర్వాత ఒత్తులను నేర్పిం చి పుస్తక పఠనం చేసే విధంగా తీర్చిదిద్దుతున్నారు. జిల్లావ్యాప్తంగా అన్నిపాఠశాలల్లో ఈ కార్యక్రమం నెల రోజులపాటు కొనసాగనున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించే దిశగా చేపడుతున్న ఈ కార్యక్రమంతో ఎంతో మంది విద్యార్థులకు చదవడం సులభతరం అవుతుంది.
సాధనతో పుస్తకాలు చదవడం విద్యార్థులకు సులభం
రీడింగ్ చాలెంజ్ ప్రణాళికతో విద్యార్థు ల్లో చదవాలనే ఆసక్తి పెరగడంతో పుస్తకాలు చదవడం సులభంగా మారుతుంది. ప్రభు త్వ పాఠశాలల్లో ప్రా రంభించిన ఈ కార్యక్రమంతో అందరికీ న్యాయం జరుగుతుంది. పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి విద్యార్థులు పుస్తకాలను ఆనర్గళంగా చదివే అవకాశాలు ఉం టాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకే విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
-పులి రాజు, ఉపాధ్యాయుడు, తునికిఖాల్సా
పఠనోత్సవంతో భయంపోతుంది
రోజూ విద్యార్థుల తో పుస్తకాలు, కథల పుస్తకాలు చదివించడంతో వారిలో ఉన్న భయంపోతుంది. ప్రతి విద్యార్థి ఆనర్గళంగా చదివేందుకు వీలుపడుతుంది. నెల రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమంతో చాలామంది విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి పెరుగుతుంది. విద్యార్థులకు చదవడంతోపాటు రాయడం కూడా తప్పనిసరి అవసరం.
-మధునాల శ్రీనివాస్, ఉపాధ్యాయుడు, ప్రజ్ఞాపూర్