సిద్దిపేట, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి):ఎవరూ బాధపడొద్దు… ధైర్యంగా ఉండాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలతో క్యాంపు కార్యాలయం సందడిగా మారింది. సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు, చిన్నకోడూరు, సిద్దిపేట అర్బన్, రూరల్, సిద్దిపేట మున్సిపాలిటీ, నారాయణరావుపేట మండలాలతో పాటు గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా సిద్దిపేటకు వచ్చిన హరీశ్రావును కలిసి పూలమొక్కలు, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎవరూ అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే హరీశ్రావు బీఆర్ఎస్ కార్యకర్తలకు భరోసా కల్పించారు. వరుసగా సిద్దిపేట నుంచి ఏడోసారి విజయం సాధించడంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీశ్రావు క్యాంప్ కార్యాలయం గురువారం బీఆర్ఎస్ కార్యకర్తలు. ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలతో సందడిగా మారింది. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి సిద్దిపేటకు వచ్చిన హరీశ్రావును పార్టీ కార్యకర్తలు కలిశారు. పూల మొక్కలు, పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. తనను కలవడానికి వచ్చిన ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. ఎవ్వరూ బాధ పడవద్దు.. ధైర్యంగా ఉండాలంటూ వారికి భరోసానిచ్చారు. నంగునూరు, చిన్నకోడూరు, సిద్దిపేట అర్బన్, రూరల్, సిద్దిపేట మున్సిపాలిటీ, నారాయణరావుపేట మండలాలతోపాటు గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండంలోని వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. దివ్యాంగులు, ఆటో రిక్షా కార్మికులు, ఇతర వర్గాల వారు హరీశ్రావును కలిశారు. సెల్ఫీలు తీసుకొని సంబురపడ్డారు. ఈ సందర్భంగా గ్రామాల్లో బీఆర్ఎస్కు వచ్చిన ఓట్ల వివరాలను హరీశ్రావుకు విన్నవించారు.
వరుసగా సిద్దిపేట నుంచి ఏడోసారి విజయం సాధించడంపై కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. 2023 ఎన్నికల్లో సిద్దిపేట నుంచి 82,308 ఓట్ల భారీ మెజార్టీతో హరీశ్రావు ఘన విజయం సాధించారు. పైగా వరుసగా ఏడోసారి ఒకే నియోజకవర్గం నుంచి గెలుపొంది రికార్డు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తొలిసారిగా 2004 అక్టోబర్లో మొదటిసారిగా సిద్దిపేట శాసన సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో హరీశ్రావు పోటీ చేసి 24,827 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అప్పటినుంచి విజయాలతో దూసుకెళ్తున్నారు. తర్వాత ప్రతీ ఎన్నికలో తన మెజార్టీని తానే అధిగమిస్తూ ప్రత్యర్థుల డిపాజిట్లను గల్లంతు చేస్తూ తిరుగులేని నేతగా ఎదిగారు. 2008లో జరిగిన ఉప ఎన్నికలో 58,935 ఓట్ల మెజార్టీ, 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 64,014 ఓట్ల మెజార్టీ, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో 95,858 ఓట్ల మెజార్టీ, 2014లో 93,328 ఓట్ల మెజార్టీ, 2018 సార్వత్రిక ఎన్నికల్లో 1,18,699 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండి ప్రజా సేవ చేసిన నేతకు ప్రజలు పట్టం కడుతూ వస్తున్నారు.
కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్
సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తను బీఆర్ఎస్ కాపాడుకుంటుందని, వారి కుటుంబాలకు అండగా ఉంటామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 2017 నుంచి 2023 వరకు సభ్యత్వం పొందిన వారిలో 60 మందికి ఇన్సూరెన్స్ ద్వారా రూ.2 లక్షల చొప్పన చెకులు ఇచ్చినట్లు తెలిపారు. చిన్నకోడూరు మండలంలోని అనంతసాగర్ గ్రామానికి చెందిన మెట్ల పరశురాములు ఇటీవల కరెంట్ షాక్తో మృతి చెందాడు. ఇబ్రహీంనగర్ గ్రామానికి చెందిన పొన్నాల మల్లేశం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. వీరికి బీఆర్ఎస్ సభ్యత్వం ఉండి కార్యకర్తగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీ ఇన్సూరెన్స్ నుంచి రూ.2 లక్షలు మంజూరు కాగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బాధిత కుటుంబాలకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కోలాహలంగా క్యాంపు కార్యాలయం
సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సిద్దిపేట క్యాంపు కార్యాలయానికి చేరుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావును కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు గురువారం ప్రజా ప్రతినిధులు, ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చా రు. దీంతో క్యాంపు కార్యాలయం ఎటు చూసినా కోలాహలంగా మారిం ది. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావుకు పుష్పగుచ్ఛాలు అందించి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ధ్రువీకరణ పత్రం అందుకున్న ఎమ్మెల్యే
సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలుపొందిన తన్నీరు హరీశ్రావుకు ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని సిద్దిపేటలో బీఆర్ఎస్ నాయకులు మోహన్లాల్ అందించారు. ఇటీవల రిటర్నింగ్ అధికారి రమేశ్బాబు చేతుల మీదుగా ఎన్నిక సర్టిఫికెట్ను ఎమ్మెల్యే హరీశ్రావు పక్షాన బీఆర్ఎస్ ఎన్నికల ఏజెంట్ మోహన్లాల్ అందుకోగా.. గురువారం సిద్దిపేటలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావుకు అందించారు.