రాయపోల్, ఆగస్టు 23: తెల్లారింది మొదలు యూరియా (Urea) కోసం పరుగులు పెడుతున్నారు. రైతులకు యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పనులన్నీ వదులుకొని కుటుంబ సమేతంగా వచ్చి గంటల తరబడి క్యూలైన్లో నిలుచున్న యూరియా దొరకకపోవడం కష్టంగా మారింది. ప్రస్తుతం వరి నాట్లు పూర్తయ్యాయి. మొక్కజొన్నకు రెండోదప యూరియా వేసే సమయం వచ్చింది. యూరియా అత్యవసరమైంది. సిద్దిపేట జిల్లా అంకిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద ఫర్టిలైజర్ షాప్లోకి 570 బస్తాల యూరియా రావడంతో శనివారం రైతులు క్యూలైన్ ఉదయం నాలుగు గంటలకు రైతులు వేచి ఉన్నారు.
యూరియా కోసం పొద్దున్నే లేచి కడుపు మార్చుకొని వచ్చి పరుగులు పెడుతూ బారులు తీరి పడిగాపులు కాస్తున్నారు. ఇలా వారం నుంచి కొంతమంది రైతులు తిరుగుతున్న యూరియా దొరకడం గగనంగా మారిందని పంటలకు యూరియా వేసే తరుణంలో ప్రభుత్వం నిబంధనలు విధించి ఒక రైతుకు ఒక యూరియా బస్తా ఇవ్వడం ఏంటని రైతులు మండిపడుతున్నారు. మండలానికి సరిపడా యూరియా అందించి రైతులు సాగుచేసిన పంటలను కాపాడుకునేటట్లు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని, అధికారులను రైతులు డిమాండ్ చేస్తున్నారు.
కాగా రైతులు మీడియా కోసం పెద్ద సంఖ్యలో రావడంతో వ్యవసాయ అధికారులు ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వగా తొగుట సీఐ షేక్ లతీఫ్, బేగంపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి, రాయపోల్ తాహసిల్దార్ కృష్ణమోహన్, ఆర్ఐ రాజమల్లు, ఏఎస్ఐ కృష్ణంరాజు, మండల వ్యవసాయ అధికారి నరేష్, ఏఈఓ స్వర్ణలత, ప్రవీణ్ తదితరులు రైతులకు టోకెన్లు అందజేశారు. అయినప్పటికీ చాలామంది రైతులు యూరియా దొరకకపోవడంతో నిరాశతో వారి సగ్రామాలకు వెళ్లిపోయారు.