సిద్దిపేటరూరల్, డిసెంబర్ 12 : ఆయిల్పామ్ సాగుపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సిద్దిపేట రూరల్ మండలంవ్యాప్తంగా సుమారు 85 మంది రైతులు 254 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు ముందుకు వచ్చారు. వివిధ రూపాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్వహించిన పలు సమావేశాలకు మండలంలోని పలు గ్రామాల్లో ఆసక్తి ఉన్న రైతులు హాజరయ్యారు. ఆయిల్పామ్ సాగు విధివిధానాలు తెలుసుకున్నారు. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వం ఆయిల్పామ్ పంట సాగును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. వీలైనంతా ఎక్కువ మంది రైతులు సాగు చేసుకునేలా అవగాహన కల్పించేలా చూడాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో క్షేత్రస్థాయిలో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు గ్రామాల్లోని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. సిద్దిపేట రూరల్ మండలంలోని పలు గ్రామాల్లోని నేలలు ఆయిల్పామ్ సాగుకు అనుకూలంగా ఉన్నాయని సాగు చేసుకుంటే ఆదా యం వస్తుందనే అధికారుల సూచనతో రైతులు సాగుపై మక్కువ చూపుతున్నారు.
తెలంగాణలో ఏటా సుమారు 2లక్షలకు పైగా ఉత్పత్తి పెంచాలనే లక్ష్యంతో ఉద్యావన శాఖ ముందుకుసాగుతోంది. దీనికి అనుగుణంగా సిద్దిపేట రూరల్ మండలంలో 2021-22 ఏడాదికి 85 మంది రైతులు దరఖాస్తులు సమర్పించారు. ఆసక్తి ఉన్న రైతులు 254 ఎకరాల్లో ఆయిల్పామ్ పంటను సాగు చేస్తున్నారు. తెలంగాణ ప్రభు త్వం కూడా బడ్జెట్లో సుమారు వెయ్యికోట్లు కేటాయించింది. ఆయిల్పామ్ సాగు చేస్తున్న రైతులకు ప్రోత్సాహకంగా అంతరపంటలు వేసుకోవడానికి కూడా ఆర్థికసాయం చేయనున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్పామ్ గెలలకు మంచి డిమాండ్ ఉంది. సిద్దిపేట రూరల్ మండలం ఆయిల్పామ్ సాగుకు అనువైన నేలలు ఉన్నాయి. తెలంగాణ ప్రభు త్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులతో నీటి సమస్య లేదు. నిరంతరం విద్యుత్ సరఫరా అందుతోంది.
సిద్దిపేట జిల్లాలో రిజర్వాయర్ల నిర్మాణంతో పుష్కలంగా నీటి నిల్వలు ఉన్నాయి. ఆయిల్పామ్ సాగు చేసే 5 ఎకరాలలోపు ఉన్న రైతులకు 90శాతం రాయితీ, 5 ఎకరాలకుపైగా ఉన్న రైతులకు 80శాతం, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి వందశాతం రాయితీ కల్పిస్తోంది. ఇందులో జీఎస్టీ మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది. ఏడాది పెరిగిన మొక్కలకు రూ.20కే అందిస్తున్నారు. అంతర సేద్యం, అంతరకృషి కోసం నాలుగేళ్లకు ఏడాదికి రూ.4200 రైతు ఖాతాలో జమ చేస్తారు. మొక్కలు పెంచడానికి గుంతలను ఉపాధి హామీ పథకం ద్వారా జాబ్కార్డు ఉన్న రైతు కుటుంబాలకు ఉచితంగా నాటుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఆయిల్పామ్ సాగు ద్వారా రైతులు నాలుగేళ్ల తర్వాత ప్రతీనెల ఉద్యోగి మాదిరిగా డబ్బులు పొందే అవకాశం కలుగుతుంది. కాగా సిద్దిపేట జిల్లాలో రూ.350 కోట్లతో ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతుండడం రైతులకు ఉపయోగకరం.
రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం
రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఆయిల్పామ్కు ప్రోత్సాహకాలు అందిస్తోంది. వాటిని సిద్దిపేటరూరల్ మండలంలోని రైతులు వినియోగించుకోవాలి. ఆయిల్పామ్ పంట అధిక లాభాలు తెచ్చే పంట. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంట కావడంతో రైతులు సాగు చేసుకుంటే ప్రతినెలా ఆదాయం వస్తుంది. సమస్య ఏదైనా ఉంటే అధికారులు తగిన సలహాలు, సూచనలు ఇస్తారు.
– మారెడ్డి రవీందర్రెడ్డి, సుడాచైర్మన్
ఆయిల్పామ్ పంట సాగును పరిశీలిస్తున్నాం..
ఎప్పటికప్పుడు ఆయిల్పామ్ పంటను పరిశీలిస్తున్నాం. సిద్దిపేట రూరల్ మండలంలో 85 మంది రైతులు ఎంతో ఆసక్తితో పంట సాగు చేసుకున్నారు. ఆయిల్పామ్ చెట్ల ఎదుగుదల ఆశాజనకంగా ఉంది. ఇంకా ఎవరైనా ఆసక్తి ఉన్న వారు ఉంటే దరఖాస్తు చేసుకుంటే తగిన సలహాలు ఇచ్చి ప్రోత్సహిస్తాం.
– బాలాజీ, ఉద్యానవనశాఖ అధికారి, సిద్దిపేటరూరల్ మండలం
ఈ చిత్రంలోని రైతు పేరు భూమయ్య. సిద్దిపేట రూరల్ మండలంలోని పుల్లూరు గ్రామంలో అధికారులు అందించిన ప్రోత్సాహంతో ఆయిల్పామ్పై ఆసక్తి పెంచుకున్నాడు. మంచి ఆదాయం వస్తుందని. ప్రతి నెలా ఉద్యోగి మాదిరిగా డబ్బు తీసుకోవాలనే సంకల్పంతో 4.20 ఎకరాల్లో ఆయిల్పామ్ పంట సాగు చేశాడు. ప్రస్తుతం ఆయిల్పామ్ సాగు ఆశాజనకంగా ఉందని చెబుతున్నాడు. అధికారుల సూచనలు పాటిస్తూ ఎప్పటికప్పుడు ఆయిల్పామ్ సాగును పరిశీలిస్తున్నాడు. ఆయిల్పామ్ సాగు ఎదుగుదల ఆశించిన మేర ఉండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.