సిద్దిపేట, మార్చి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులకు భరోసా ఏదీ..? వడగండ్ల వర్షం, ఈదురుగాలులతో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో వందలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినా ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదు. రైతుల గురించి పట్టించుకున్న పాపానపోలేదు. పంట నష్టం జరిగినా జిల్లా మంత్రులు పంటలను సందర్శించలేదు. రైతులను ఓదార్చలేదు. జిల్లా మంత్రులు రైతుల సమస్యలపై దృష్టి సారించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతను అతలాకుతలం చేసింది. పంటలు చేతికి రానున్న సమయంలో కురిసిన వడగండ్ల వాన రైతులకు కన్నీరు మిగిల్చింది. వరి, మొకజొన్న, జొన్న పంటలతోపాటు ఇతర పంటలు దెబ్బతినడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. గతంలో అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వెళ్లి రైతులను పరామర్శించి రైతులకు భరోసా కల్పించారు. అకడికకడే ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం ప్రకటించి అమలు చేశారు. ఈ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. రాజకీయాలు తప్ప, రైతు ప్రయోజనాలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేలొని అన్నదాతకు అండగా నిలవాలని రైతులు కోరుతున్నారు.
సిద్దిపేట జిల్లాలో 1,794 మంది రైతులకు చెందిన 2,806 ఎకరాలు, మెదక్ జిల్లాలో 2,154 మందికి చెందిన 2,766 ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో 343 మంది రైతులకు చెందిన 714 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 4,191 మంది రైతులకు చెందిన 6,286 ఎకరాల్లో వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లాలో వడగండ్లతో ఇంత నష్టం జరిగినా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. రైతులకు పంట నష్టం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. మరో పక్క బ్యాంకు రుణాలు చెల్లించాలని రైతులకు బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు. జిల్లాకు చెందిన మంత్రులు కనీసం రైతుల గురించి పట్టించుకోవడం లేదు. యాసంగి సాగు ఆరంభం నుంచి రైతులకు కష్టాలు వెంటాడుతూనే ఉంటున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో సాగుకు ముందే పెట్టుబడి సాయం కింద రైతుబంధును అందించి రైతులను ఆదుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు పూర్తిస్థాయిలో రైతుబంధు సాయం ఇవ్వలేదు. దీంతో రైతులు అప్పులు తెచ్చి పంటలను సాగు చేశారు. పంట చివరి దశలో సాగునీరు అందక, కరెంట్ కష్టాలతో పంటలు ఎండిపోతున్నాయి. కొన్నిచోట్ల పశువుల మేపుతున్నారు. ఎండిపోగా మిగిలింది చేతికి వస్తుందనుకుంటే వడగండ్ల రూపంలో పంటలకు నష్టం జరిగిందని రైతులు బోరున విలపిస్తున్నారు. రైతులను ప్రభుత్వం ఆదుకొని పంట పెట్టుబడి సాయంతో పాటు నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.
రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏది..? రైతుబంధు ఏది..? రైతులకు పంట బోనస్ ఏది..? అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎమయ్యాయి..? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలవుతున్నా ఇంతవరకు రైతుబంధు పూర్తిగా వేయలేదు. కేవలం మూడు ఎకరాల వరకు మాత్రమే రైతులకు రైతుబంధు సాయం వేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకున్నది. రైతులు అప్పలు చేసి పంటలు సాగు చేశారు. యాసంగి పంట చేతికి వచ్చే సమయానికి సైతం రైతుబంధు రాలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు సకాలంలో రైతుబంధు వేయడంతో రైతులు హాయిగా సాగు చేసుకున్నారు. పెట్టుబడి సాయం సకాలంలో రావడంతో రైతులు వడ్డీ వ్యాపారుల వద్దకెళ్లే అవసరం లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ రైతులు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్తున్నారు. రైతులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. మరో పది రోజులు అయితే పంట చేతికొస్తుంది. ఈ సమయంలో రైతులకు పంట బోనస్ ప్రకటించాల్సిన ప్రభుత్వం ఆ ఊసే లేకుండా నెట్టుకొస్తుంది.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో వచ్చిపోయే కరెంట్తో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతాంగానికి నాణ్యమైన 24 గంటల కరెంట్ను అందింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాణ్యమైన కరెంట్ రావడం లేదు. వచ్చిపోయే కరెంట్తో బోరుబావుల మోటర్లు కాలిపోతున్నాయి. బోరు నుంచి మోటరును పైకితీసి రిపేరు చేయించి మళ్లీ బోర్లో దించడానికి ఎంత లేదన్నా సుమారుగా రూ.10 వేల వరకు ఖర్చు అవుతున్నది. ఒక్కో రైతు మోటరు వారంలో రెండుసార్లు కాలిన సందర్భాలూ ఉన్నాయి. దీంతో ఖర్చులు తడిసి మోపెడై రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా కాలిపోయిన మోటర్లు కనిపిస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో మోటరు మెకానిక్లకు పనిలేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చిన మూడు నెలల్లోనే కరెంట్ మోటరు మెకానిక్లకు చేతినిండా పని దొరుకుతున్నది. ఎంత లేదన్నా సగటున రోజుకు 8 నుంచి 10 మోటర్లు రైతుల నుంచి రిపేరుకు వస్తున్నాయని మెకానిక్లు తెలుపుతున్నారు. ఎండిన మడులను పారించడానికి రైతులు కష్టాలు పడాల్సి వస్తుంది. వరికి పొట్ట దశలో ఎంత నీరు అందిస్తే అంత మంచిగా పంట వస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని పంటను కాపాడుకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పంటలను రక్షించుకోవడానికి బోర్లు వేస్తున్నారు. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల తదితర ప్రాంతాల్లో ఎక్కడచూసినా బోరుబండ్లు కనిపిస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతం బోరుబండ్లు, క్రేన్ల యజమానులు బిజీఅయ్యారు. రైతులు పెట్టుబడులు పెట్టి ఇంతచేసినా పంట చేతికి వస్తుందా..? అని ఆందోళన చెందుతున్నారు. ఇంకోవైపు ఎండిన పంటల్లో పశువులను మేపుతున్నారు. చాలా గ్రామాల్లో పంట ఎండిపోవడంతో రైతులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు.