హైదరాబాద్ : గజ్వేల్, హుస్నాబాద్లలో కొవిడ్ వార్డులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. అలాగే వార్డుల్లో సరిపడా ఆక్సిజన్, రెమ్డెసివిర్, మందులను అందుబాటులో ఉంచాలని సూచించారు. వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి బుధవారం సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. నలుగురు వైద్యాధికారులు ఒక కోర్ టీమ్ చొప్పున ఏర్పడి బాధితుల ఆరోగ్య పరిస్థితిని ప్రతిరోజు ఒకసారి సమీక్షించాలన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న రోగులను గుర్తించి వారికి మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రత్యేక చొరవ చూపాలన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో 108 మంది వైద్యులు, 316 మంది స్టాఫ్ నర్సులు ఉన్నారని మంత్రి తెలిపారు. రోగులు 195 మంది మాత్రమే ఉన్నట్లు చెప్పారు. ప్రతి ఒకరు లేదా ఇద్దరు రోగులకు ఒకరి చొప్పున స్టాఫ్ నర్సులు ఉంటూ బాధితుల ఆరోగ్య పరిస్థితిని కనిపెట్టుకుని వారు త్వరగా కోలుకునేలా చూడాలన్నారు. ఆర్ఎంవో, ఆస్పత్రి సూపరీంటెండెంట్ లు రోజుకు మూడు సార్లు కొవిడ్ వార్డులలో రౌండ్ లు వేయాలన్నారు. ఈ సమావేశంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి వెంకట్రామరెడ్డి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ తమిళ అరుసు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.