సిద్దిపేట, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్జాం తుఫాన్ ప్రభావం ఉమ్మడి జిల్లాపై పడింది. రెండుమూడు రోజుల నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. అకాల వర్షం, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో జాప్యం జరుగుతోంది. దీంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. ధాన్యం మొదటి రకానికి క్వింటాల్ రూ. 2,203, సాధారణ రకానికి క్వింటాల్ రూ. 2,183 ప్రభుత్వం ధర నిర్ణయించింది. సిద్దిపేట జిల్లాలో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా ఇప్పటివరకు 417 కేంద్రాలను ఏర్పాటు చేసి 1,93,206 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. మెదక్ జిల్లాలో 402 కేంద్రాల్లో 2,89,389 మెట్రిక్ టన్నులు, సంగారెడ్డి జిల్లాలో 198 కేంద్రాల్లో 1,44,393 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. వర్షానికి ధాన్యంతోపాటు పత్తి, ఇతర పంటలకు నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో రెండు మూడు రోజుల నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ముసురుతో కూడిన వర్షం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షం, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ జాప్యమవుతుండడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. గ్రామాల్లో ఎక్కువ శాతం రైతులు ధాన్యాన్ని వ్యాపారులకు విక్రయిస్తున్నారు. అక్టోబర్ చివరి నుంచి జిల్లాలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. దాదాపు నెలన్నర రోజులు కావస్తుంది. అనుకున్న స్థాయిలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరగలేదు. ధాన్యం మొదటి రకానికి క్వింటాల్ రూ. 2,203, సాధారణ రకానికి క్వింటాల్ రూ. 2,183 ఉంది. ఇందుకు తక్కువ ధరకు రైతులు వ్యాపారులకు అమ్ముకోవల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ సేకరణలో జాప్యం జరుగుతుండడం కారణంగానే పెద్దఎత్తున ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నామని రైతులు తెలుపుతున్నారు. మరోవైపు యాసంగి సిజన్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే రైతులు తుకం పోసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ సమయంలో రైతులకు పెట్టుబడి సాయం అవసరం ఉంటుంది. ఇటు ధాన్యం డబ్బులు సరిగ్గా రాక అటు యాసంగి రైతుబంధు సాయం రాకపోవడంతో రైతులు డబ్బుల కోసం సావుకారి బాట పట్టాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. రెండు రోజుల కిందట మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో ధాన్యం డబ్బులు తీసుకోవడానికి రైతులు క్యూలో చెప్పులు పెట్టారు. సిద్దిపేట జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసే లక్ష్యం కాగా ఇప్పటి వరకు 417 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 1,93,206 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. మెదక్ జిల్లాలో 402 కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 2,89,389 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. సంగారెడ్డి జిల్లాలో 198 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 1,44,393 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు.
తుఫాన్తో రైతుల ఆందోళన
ఉమ్మడి మెదక్ జిల్లాలో అకాల వర్షంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యంతో పాటు రైతుల కల్లాల వద్ద ఉన్న ధాన్యం తడుస్తుండడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ఆలస్యం కావడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. వానకాలంలో ధాన్యాన్ని ఎక్కువ శాతం ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించినట్లు ఆయా గ్రామాల రైతులు చెబుతున్నారు. ప్రతి గ్రామంలో సరాసరి యాభైశాతానికి పైగానే వ్యాపారులకు ధాన్యాన్ని విక్రయించారు. కొనుగోలు కేంద్రాల్లో ఆలస్యం కావడం తదితర సమస్యలతో రైతులు ఎక్కువగా వ్యాపారుల వైపే మొగ్గు చూపారు. పైగా అకాల వర్షం వల్ల చాలామంది రైతులు నేరుగా మిల్లర్లకు, గ్రామాల్లోని వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. క్వింటాల్కు రూ. 2వేల నుంచి రూ.2100 మధ్యన వ్యాపారులు ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు. ధాన్యానికి డబ్బులు చెల్లించేందుకు రైతులకు 15 రోజుల గడువు పెడుతున్నారు. 15 రోజుల లోగా చెల్లిస్తామంటూ వ్యాపారులు రైతుల వద్ద ధాన్యాన్ని సేకరిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మినా అవి సమయానికి వస్తాయో? లేదో? అని ఎక్కువ మొత్తంలో రైతులు ప్రైవేట్ వ్యాపారుల వైపే మొగ్గు చూపుతున్నారు. గ్రామాల్లో చాలా వరకు రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్నారు. జిల్లాలో కురుస్తున్న వర్షానికి ధాన్యంతో పాటు పత్తి చేనులు ఇతర పంటలకు నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.