హుస్నాబాద్ : జాతిపిత మహాత్మాగాంధీ (Mahatma Gandhi) స్ఫూర్తితో పట్టణాలు, గ్రామాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా మంగళవారం హుస్నాబాద్ పట్టణంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ కార్మికులను(Municipal workers) సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛతా (Cleanliness) కార్యక్రమంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. పట్టణాలు, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం బాధ్యతగా గుర్తించాలని సూచించారు. హుస్నాబాద్ పట్టణాన్ని కాలుష్య రహిత, ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛతా కార్యక్రమాలను సామాజిక బాధ్యతగా గుర్తించినప్పుడు పల్లెలు, పట్టణాలు సస్యశ్యామలంగా, పరిశుభ్రంగా విలసిల్లుతాయన్నారు.
వాడవాడలా చెత్త సేకరణ చేసి పట్టణాలు, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేనివన్నారు. గాంధీజీ లక్ష్యమైన స్వచ్ఛతా కార్యక్రమాన్ని నెరవేరుస్తున్న ఘనత పారిశుధ్య కార్మికులదేనని ప్రశంసించారు. హుస్నాబాద్ పట్టణానికి ఇప్పటి వరకు మూడు జాతీయ స్థాయి అవార్డులు రావడం హర్షనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్చైర్పర్సన్ అయిలేని అనితారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.