మధిర, ఆగస్టు 16 : తెలంగాణ సాయుధ పోరాటం, స్వాతంత్య్ర ఉద్యమకాలం నుంచి జమ్మలపురం కేశవరావు వంటి ఎందరో త్యాగధనులను అందించిన పుణ్యభూమి మధిర అని, అటువంటి ఎంతో చరిత్ర కలిగిన మధిర పేరును కాంగ్రెస్ నాయకులు తమ స్వార్థం, అవినీతితో దిగజారుస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం మధిరలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మధిర నియోజకవర్గంలో అభివృద్ధి పేరుతో అడ్డగోలు విధ్వంసం సాగుతోందని, నందిగామ రోడ్డు నుంచి పట్టణం వరకు రోడ్డు వెడల్పు పేరుతో దశాబ్దాలుగా ఉన్న కట్టడాలను, చిరువ్యాపారుల షాపులను, మెట్లను, ర్యాంపులను అడ్డగోలుగా కూల్చివేశారని ఆరోపించారు. అధికార కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రోడ్డుకు దగ్గరగా ఉన్నప్పటికీ దాన్ని వదిలేసి, సామాన్య వ్యాపారుల భవనాలను కూల్చడం ఏ రకమైన న్యాయమని ఆయన ప్రశ్నించారు. మధిరకు అసలు ఔటర్ రింగ్రోడ్డు అవసరమేలేదని, కేవలం కమీషన్ల కోసమే రూ.193 కోట్లతో ఈ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని కమల్రాజు ఆరోపించారు. విజయవాడ, ఖమ్మం, వరంగల్ వంటి పెద్ద నగరాలకే లేని ఓఆర్ఆర్ మధిరకు ఎందుకని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ వల్ల బయటి నుంచి వచ్చే వాహనాలు పట్టణంలోకి రాకుండా వెళ్లిపోతే, మధిరలోని టీ కొట్లు, హోటళ్లు, దుస్తుల వ్యాపారాలు దెబ్బతిని పట్టణం నిర్జనంగా మారుతుందని హెచ్చరించారు.
రూ.193 కోట్లతో టెండర్లు పిలిచి, 260 ఎకరాల రైతుల సారవంతమైన భూములను లాకుంటున్నారని.. భవిష్యత్తులో ఇది 1000 ఎకరాలకు చేరుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. మారెట్లో ఎకరం 30 నుంచి 50 లక్షలు ఉంటే, రైతులను పోలీసులతో బెదిరిస్తూ 15 నుంచి 20 లక్షలు మాత్రమే ఇచ్చి అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మధిర ప్రజలు, మేధావులు, ఈ విధ్వంసాన్ని ప్రశ్నించాలని, మధిర ఉనికిని, భవిష్యత్తును కాపాడుకోవడానికి గొంతు కలపాలని కమల్రాజు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కౌన్సిలర్ ఎన్నంశెట్టి అప్పారావు, నాయకులు చిత్తూరు నాగేశ్వరరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, చావా వేణు, బికి కృష్ణప్రసాద్, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, భాసర్రెడ్డి, వేణుబాబు, నాగబాబు, రామారావు, వీరారెడ్డి, సైదా, కృష్ణ, రాంబాబు పాల్గొన్నారు.