రఘునాథపాలెం, ఆగస్టు 16 : ఎన్ని ఆటంకాలు ఎదురైనా, కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు, కేసులకు గురిచేసినా బీఆర్ఎస్ పార్టీని నమ్ముకుని ఉన్న ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ భరోసానిచ్చారు. ఆదివారం ఖమ్మం నగరం 8వ డివిజన్ పరిధి గోపాలపురంలోని ఓ ఫంక్షన్హాల్లో ఖానాపురం హవేలీ పరిధిలోని 15 డివిజన్లకు చెందిన బీఆర్ఎస్ పార్టీ బీఎల్ఏల ఆత్మీయ సమావేశం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మాజీ అధ్యక్షుడు దేవభక్తిని కిషోర్బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పువ్వాడ అజయ్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఖమ్మం నియోజకవర్గంలో అర్హులైన ప్రతిఒక్కరి ఓటును పరిరక్షించడంలో బీఆర్ఎస్ పార్టీ బీఎల్ఏలు శక్తివంచన లేకుండా పనిచేశారని గుర్తుచేశారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ బీఎల్ఏలు ప్రతి ఓటరును కలిసి ఓటు గల్లంతు కాకుండా మేమున్నామనే భరోసా కల్పించారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలను టార్గెట్గా చేసి అనేక ఇబ్బందులు, బెదిరింపులు, కేసులకు గురిచేస్తున్న విషయాన్ని గమనిస్తూనే ఉన్నట్లు తెలిపారు. బీఆర్ఎస్లో పదవులను అనుభవించిన అనేకమంది అధికారం కోల్పోగానే తిరిగి అధికారంవైపు మళ్లారని, బీఆర్ఎస్ సిద్ధాంతాలను నమ్ముకుని నిలబడిన నిజమైన కార్యకర్తలే పార్టీకి అసలైన బలమన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలమైన శక్తిగా ఉందని, నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి బూత్ స్థాయిలో కమిటీలను మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు.
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నియోజకవర్గంలో అరాచక శక్తులను ప్రోత్సహిస్తున్నారని పువ్వాడ అజయ్ విమర్శించారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తులు ప్రస్తుతం తుమ్మలతోపాటు ఆయన కుమారుడి వెంట ఉండి ఇసుక, మట్టి, భూ అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టులో నాణ్యతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, ఏడాదికే కాలువ సీసీ లైనింగ్ కూలిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. మున్నేరుపై తీగల వంతెన, కాంక్రీట్ వాల్, ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణాలకు నిధుల మంజూరు కేసీఆర్ ప్రభుత్వం హయాంలోనే జరిగిందనే విషయాన్ని గుర్తుచేశారు. రేవంత్రెడ్డి పాలన అట్టర్ఫ్లాప్ సినిమాలా ఉందని విమర్శించారు.
నాలుగు దశాబ్దాలుగా పువ్వాడ కుటుంబానికి ఖమ్మం నియోజకవర్గంతో విడదీయరాని బంధం ఉందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. తన పోటీపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని, తాను ఖమ్మం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని పువ్వాడ తేల్చిచెప్పారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఇది కాంగ్రెస్ నాయకుల నోటనే వినిపిస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఆ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్కుమార్ అధ్యక్షత వహించగా బీఆర్ఎస్ పార్టీ హవేలీ డివిజన్ల సమన్వయ కమిటీ సభ్యుడు బీరెడ్డి నాగచంద్రారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు, కర్నాటి కృష్ణ, కూరాకుల వలరాజు, దండా జ్యోతిరెడ్డి, నాగండ్ల కోటి, బత్తుల మురళీప్రసాద్, కొణకంచి వరప్రసాద్, చిలుమూరు కోటి, లింగనబోయిన లక్ష్మణ్, వాంకుడోతు సురేశ్, వీరేందర్గౌడ్, వెంకన్న, మదార్, వీరూనాయక్, సురేశ్, సతీశ్, రమేశ్ పాల్గొన్నారు.