టేక్మాల్, ఫిబ్రవరి 18: రాష్ట్రంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని వైద్యారోగ్య శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు. మండల కేంద్రంలోని కేజీబీవీ, ఆదర్శ పాఠశాల, గురుకుల ఆశ్రమ పాఠశాలలను పరిశీలించారు. మౌలిక సదుపాయల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కేజీబీవీ భవనం మరమ్మతులకు రూ. 70లక్షలతో శంకుస్థాపన చేశారు. పాఠశాల అభివృద్ధి కోసం అదనంగా మరో రూ. కోటి 50 లక్షలు మంజూరు చేయాలని కేజీబీవీ ప్రత్యేక అధికారిణి బాలామణి కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. రూ. 50 లక్షలతో చేపట్టనున్న ఆదర్శ పాఠశాల మౌలిక వసతుల కల్పన పనుల కోసం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పాఠశాలకు క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయాలని, అందుకు అదనంగా రూ. కోటీ 50లక్షలు మంజూరు చేయాలని ప్రధానోపాధ్యాయుడు కరుణాకర్రెడ్డి మంత్రికి విన్నవించగా నిధులు వచ్చేలా కృషి చేస్తానన్నారు. గిరిజన పాఠశాల విద్యార్థుల మౌలిక వసతుల కోసం రూ. 35 లక్షలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయగా, మంత్రి సానుకూలంగా స్పందించారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, ఆరోగ్య శ్రీ కింద సుమారు 18 రకాల రోగాలను నయం చేసే విధంగా రూ.10 లక్షలతో ఉచిత ఆరోగ్య సేవలను అందిస్తామన్నారు. విద్యా, వైద్యాన్ని ప్రతి పేదవాడికి ఉచితంగా అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రజలకు నాణ్యమైన, ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని మంత్రి వెల్లడించారు. మారుమూల ఎల్లుపేట గ్రామంలో వైద్య ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మెదక్ ఆర్డీవో అంబదాసు రాజేశ్వర్, ఎస్సీ,ఎస్టీ అభివృద్ధి శాఖ అధికారి విజయలక్ష్మి, డీఎంహెచ్వో చందూనాయక్, తహసీల్దార్ కృష్ణ, ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.