అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేళ అక్కడ అన్నదానం చేసే భాగ్యం సిద్దిపేటకు చెందిన అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి దక్కింది. సుమారు 45 రోజుల పాటు రోజుకు సుమారు 7వేల మందికి అన్నదానం చేసే అవకాశాన్ని కల్పించారు. ఈనెల 22న రామమందిరం ప్రారంభోత్సవ నేపథ్యంలో రెండు నెలల కిందట అయోధ్య ఆలయ కమిటీతో వీరు సమావేశం కాగా, దక్షిణ భారతదేశం నుంచి తొలిసారి అన్నప్రసాద వితరణకు ఒక కేంద్రాన్ని కేటాయించారు. అయోధ్యలోని రామ మందిరానికి సమీపంలోని క్షేత్రపురిలో ఏర్పాటు చేసిన 3వ నెంబర్ లంగర్లో ఈనెల 15వ తేదీ నుంచి ఫిబ్రవరి 28 వరకు అన్నదానం చేయనున్నారు.
సిద్దిపేట, జనవరి 4 : అయోధ్య రాములోరి సన్నిధిలో అన్నదానం చేసే అరుదైన అవకాశం దక్షిణ భారతదేశంలోనే తొలిసారి సిద్దిపేటకు చెందిన అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి దక్కింది. సుమారు 45 రోజులపాటు ఇక్కడ రోజుకు 5వేల నుంచి 7వేల మందికి అన్నదానం చేసే భాగ్యాన్ని కల్పించారు. ఈ నేపథ్యంలో నమస్తే తెలంగాణ అందిస్తున్న ప్రత్యేక కథనం. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని ఆర్యోక్తి… అన్నిదానాల్లో కెల్ల అన్నదానం విశిష్టమైంది. 2011 నుంచి అన్నదానం చేస్తూ అనేక మంది యాత్రికుల ఆకలిని తీరుస్తున్న సిద్దిపేటకు చెందిన ప్రముఖ సేవా సంస్థ అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి అయోధ్య రామమందిరంలో రామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఈ నెల 22న జరుగనున్న నేపథ్యంలో అక్కడ అన్నప్రసాద వితరణ చేసే అవకాశాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ద్వారా లభించింది. జమ్మూకశ్మీర్లోని ప్రసిద్ధ మంచు లింగం అమర్నాథ్ యాత్రికులకు అన్నదానం చేసే లక్ష్యంతో సిద్దిపేటలో 2011లో ప్రారంభమైన అమర్నాథ్ అన్నదాన సేవా సమితి అప్పటి నుంచి చార్ధామ్ యాత్రికులకు బాల్తల్, పంచ తరుణిల వద్ద లంగర్లు వేసి అన్నదానం చేస్తున్నది.
దీంతోపాటు పర్యావరణ పరిరక్షణకు వినాయకచవితి రోజు ఏటా మట్టి వినాయకులను ప్రజలకు అందజేస్తున్నది. అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న అమర్నాథ్ అన్నదాన సేవాసమితి అయోధ్య రామ మందిర ప్రతిష్ఠాపనోత్సవం సందర్భంగా ఈనెల 15 నుంచి ఫిబ్రవరి 28 వరకు అక్కడికి వచ్చే సాధువులు, స్వామీజీలు, పీఠాధిపతులు, యాత్రికులకు దాదాపు 45రోజులపాటు అన్నదాన వితరణ చేయనున్నది. అయోధ్యలోని రామమందిరానికి సమీపంలోని క్షేత్రపురిలో ఏర్పాటు చేసిన 3వ నెంబర్ లంగర్లో అన్నదాన కార్యక్రమం చేపడుతారు. లంగర్లోనే కాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఆటోల సహాయంతో అయోధ్య పురవీధుల్లోనూ భక్తులకు అన్నదానం చేసేందుకు సిద్ధమవుతున్నారు. సుమారు రూ.98లక్షల నుంచి రూ.కోటి ఖర్చయ్యే ఈ కార్యక్రమాన్ని సేవా సమితి సభ్యులు, దాతల సహకారంతో అమలు చేయనున్నారు. ఈ అన్న వితరణ కార్యక్రమంలో 120మంది సభ్యులు తమ సేవలు అందించనున్నారు. రోజూ ఉదయం ఇడ్లి, ఉప్మా, మధ్యాహ్నం చపాతి, భోజనంతోపాటు సాయంత్రం భక్తులకు అల్పాహారం, తేనీరు అందించనున్నారు.
12 సంవత్సరాలుగా ఏటా అమరనాథ్లో పరమేశ్వరుడి చెంత భక్తులకు అన్నదానం చేస్తున్నాం. భగవాన్ శ్రీరామచంద్రుడి కృప కటాక్షాలతో అయోధ్యలో 45 రోజుల పాటు అన్నదాన వితరణ చేసే భాగ్యం కలిగింది. ఇది ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తున్నాం. భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు మా కార్యక్రమాలు ఏటా కొనసాగిస్తాం. సామాజిక సేవలో ఉన్న తృప్తి మరేదాంట్లో దొరకదు.