రామచంద్రాపురం, ఏప్రిల్ 10: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ సమిష్టిగా పనిచేసి అభ్యర్థి నీలంమధు విజయానికి కృషి చేయాలని మంత్రి కొండాసురేఖ పిలుపునిచ్చారు. ఆర్సీపురం డివిజన్లోని శ్రీ కన్వెన్షన్లో బుధవారం ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ సన్నాహక సమావేశానికి మంత్రి హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీకి ఓటు వేసేలా ప్రజలను చైతన్యం చేయాలన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేస్తే ఒరిగేది ఏమి లేదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటేనే మెదక్ జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ శ్రేణులు కదనరంగంలోకి దూకి, ఇంటింటి ప్రచారం నిర్వహించి మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని కోరారు. అంతకుముందు పార్టీ అభ్యర్థి నీలం మధు, ఇన్చార్జి కాట శ్రీనివాస్గౌడ్ మంత్రి సురేఖకు స్వాగ తం పలికారు. సమావేశంలో ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలాజగ్గారెడ్డి, చెరుకు శ్రీనివాస్రెడ్డి, ఎన్ఎస్యూఐ నాయకుడు రవీందర్గౌడ్, నర్సింహారెడ్డి, వినయ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.