సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 27: మెదక్ పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లు సజావుగా పూర్తి చేయాలని మెదక్, సంగారెడ్డి జిల్లాల ఎన్నికల అధికారులు రాహుల్ రాజ్, వల్లూరు క్రాంతి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఎన్నికల నిర్వహణ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని, బీఎల్వోలు వీఐపీ ఓటర్ల జాబితా పరిశీలించి, రెండుచోట్ల నమోదైన వీఐపీ పేర్లను ఒకచోట తొలిగించాలని, సెక్టోరల్ అధికారులు, బీఎల్వోలు, తహసీల్దార్లు, ఏఆర్వోలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. అతిపెద్ద నియోజకవర్గం పటాన్చెరు పరిధిలోని 5 మండలాల్లో 391 పోలింగ్ కేంద్రాలు, 20 ఎగ్జిల్లరీ పోలింగ్ కేంద్రాలు, సంగారెడ్డి నియోజకవర్గంలో 281 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. 85 ఏండ్లు వయస్సు ఉన్న వారికి ఇంటి వద్దనే ఓటువేసే సౌకర్యం కల్పిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్వో, ఏఆర్వోలు, తహసీల్దార్లు, నోడల్, సెక్టోరల్ అధికారులు పాల్గొన్నారు.