చిన్నకోడూరు, జూన్ 22 : రంగనాయకసాగర్ రిజర్యాయర్లో గోదావరి జల సవ్వడులు మరోమారు ప్రారంభమయ్యాయి. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ పంప్ హౌస్లోని మోటర్ను బుధవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రారంభించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రంగనాయక సాగర్ రిజర్యాయర్లో మోటర్లను ఆన్ చేసి నీటిని ఎత్తి పోస్తున్నారు. ప్రస్తుతం 2 టీఎంసీలు నింపే విధంగా ఇరిగేషన్ అధికారులు నిమగ్నమయ్యారు. ఒక మోటర్ను 24 గంటలపాటు నిర్విరామంగా నడిపిస్తే 0.25 టీఎంసీ నీరు రిజర్వాయర్లో ఎత్తి పోస్తుంది.
20 టీఎంసీలు నింపాలంటే సుమారు 8 రోజులపాటు విడుతల వారీగా మోటర్లను నడిపేస్తే 2 టీఎంసీలు నీరు చేరుతుంది. బుధవారం నాటికి రిజర్వాయర్లో 0.69 టీఎంసీ ఉండగా, గురువారం నాటికి 0.85 టీఎంసీ నీరు వచ్చి చేరింది. దీనితో ఆగిపోకుండా ఎప్పటికప్పుడు నీటిని ఎత్తిపోయడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. సాగుకు ఇబ్బంది తలెత్తకుండా రెండు పంటలకు గోదావరి నీళ్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. రిజర్వాయర్లో గోదావరి నాళ్లు నింపుతుండడంతో ఈ ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మాకు రెండో పంట సాగు చేసుకోవడానికి ఢోకా లేదని రైతులు మురిసిపోతున్నారు. నీటిని ఎత్తిపోయడంతో పర్యాటకులు తాకిడి పెరిగింది.